కశ్మీర్లో పరిస్థితి పునరుద్ధరణకు కృషి చేయండి, జాతి ప్రయోజనాలు కూడా ముఖ్యమేమన్న సుప్రీం
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో రాజకీయ నేతల నిర్బందంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి స్పస్టంచేసింది. ఈ క్రమంలో ప్రజల సౌకర్యాలకు పెద్దపీట వేయాలని స్పష్టంచేసింది. ఆరోగ్య వసతులు, ప్రజా రవాణా, విద్యా సంస్థలను పునరుద్ధరించాలని సూచించింది. అదే సమయంలో జాతి ప్రయోజనాలను కాపాడాలని తేల్చిచెప్పింది.
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ముకశ్మీర్ను జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడంతో రాజకీయ నేతలను గృహ నిర్భందించిన సంగతి తెలిసిందే. తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా స్తంభించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్ఏ బోడ్డే, ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం కశ్మీర్ అంశంపై వేసిన పిటిషన్లను విచారించింది. కశ్మీర్లో జాతి ప్రయోజనాలు ముఖ్యమని ..దాంతోపాటు అంతర్గత భద్రత .. ఇతర పరిస్థితులు కూడా ముఖ్యమని పేర్కొంది. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని స్పస్టంచేసింది. స్కూళ్లు, కాలేజీలు తెరువాలని, ప్రజా రవాణాను మెరుగుపరచాలని తేల్చిచెప్పింది.
కశ్మీర్ విభజన గత నెల 5న జరిగింది. అప్పటినుంచి లోయలో మొబైల్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ స్తంభించిపోయింది. దీనిపై సుప్రీంకోర్టు మరోసారి ఈ నెల 30 విచారణ చేపడుతామని పేర్కొన్నది.