పాక్ అణ్వాయుధ తయారీ కేంద్రంలో ఏం జరుగుతోంది?: ముప్పు తప్పదంటోన్న నిపుణులు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తన అణ్వస్త్ర కార్యకలాపాలను విస్తరించుకుంటోందా? గతంలో ఎప్పుడూ లేని విధంగా అణ్వాయుధాలను పెద్ద ఎత్తున సమకూర్చుకుంటోందా? తమ దేశంలో ఉన్న ఏకైక అణ్వాయుధ తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ లోని రావల్పిండి జిల్లా కహుటాలో ఉన్న అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తోందని, తన వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే పనిలో పడిందని తేటతెల్లమౌతోంది. దీనికోసం అత్యంత యురేనియాన్ని పెద్ద ఎత్తున సమీకరించే పనిలో పని పడిందని అంటూ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
అంతర్జాతీయ దేశాల్లో ఎదురు దెబ్బ ఫలితమేనా?
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన వ్యవహారాన్ని అంతర్జాతీయ దేశాల దృష్టికి తీసుకెళ్లి భారత్ పై నిందలు వేయడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. 370 రద్దును ఎత్తేయడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. అవన్నీ బెడిసి కొట్టాయి. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఏకాకిని చేయడానికి పాకిస్తాన్ చేసిన వరుస ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఎదురు దెబ్బలు తగిలాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న మిత్రదేశం చైనా సైతం పాకిస్తాన్ కు సహకరించలేకపోయింది. వరుసగా ఎదురైన చేదు అనుభవాలతో పాకిస్తాన్.. భారత్ మరింత అక్కసును పెంచుకుందని, దానికి ముగింపు ఎలా పలుకుతుందనేది ఆసక్తికరంగా మారినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రకటన వెనుక ప్రధాన ఉద్దేశమదే?
ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచూ కొన్ని ఆశ్చర్యకరమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. అణ్వాయుధాలను కలిగిన ఏ దేశమైనా ప్రాణాలు తీయడమో, ప్రాణాలు పోగొట్టుకోవడమో చేస్తుందంటూ పరోక్షంగా హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను అణచి వేస్తోన్న భారత ప్రభుత్వం.. వెంటనే తన చర్యలను మానుకోవాలని, లేదంటే అణ్వాయుధాలను కలిగిన రెండు దేశాల మధ్య చోటు చేసుకునే సైనిక చర్యలను ప్రపంచం మొత్తం చూస్తుందని ఇమ్రాన్ ఖాన్ సూచనప్రాయ ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై భారత్ వెనక్కి తగ్గకపోతే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఉగ్రవాద దాడులు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనీ ఆయన చెప్పుకొచ్చారు. అంత ధైర్యంగా ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన వెనుక ప్రధాన ఉద్దేశం.. అణ్వాయుధ కార్యకలాపాలను విస్తరించుకోవడమేనని ఇండియా టుడే వెల్లడించింది.
న్యూక్లియర్ టెక్నాలజీని స్మగ్లింగ్ చేసిన పాక్
న్యూక్లియర్ రంగంలో పాకిస్తాన్ అంచనాలకు మించి రాణించిందనే అంటున్నారు విశ్లేషకులు. 2004లో రావల్పిండిలోని కహుటా వద్ద అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని నిర్మించింది. పాకిస్తాన్ అణు పితామహుడిగా పేరున్న అబ్దుల్ ఖదీర్ ఖాన్ దీనికి ఆద్యుడు. న్యూక్లియర్ రంగానికి, అణ్వాయుధాల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశారనే అరోపణలు అబ్దుల్ ఖదీర్ ఖాన్ పై ఉన్నాయని ఇండియా టుడే పేర్కొంది. ఆయన పేరు మీదే కహుటాలో అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని నిర్మించింది పాకిస్తాన్. ప్రస్తుతం ఆ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తోంది. 2014 నుంచి ఈ కేంద్రం విస్తరణ పనులను చేపట్టింది. ఆ ఏడాదే నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన విషయం గమనార్హం. అణ్వాయుధ కేంద్రం విస్తరణకు సంబంధించిన కొన్ని కీలక ఫొటోలను ఇండియా టుడే సేకరించింది. వాటిని ప్రసారం చేసింది.
అక్రమంగా అణ్వాయుధ కేంద్రం విస్తరణ..
ఖాన్ అణ్వాయుధ తయారీ కేంద్రాన్ని పాకిస్తాన్ విస్తరింస్తోందనే విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి అసోసియేషన్ సైతం ధృవీకరించినట్లు సమాచారం. ఈ కేంద్రం విస్తరణ కార్యకలాపాలను అక్రమ చర్యగా ఆ అసోసియేషన్ పేర్కొంది. తన మిత్రదేశం చైనా సహకారంతో పాకిస్తాన్ అణ్వాయుధ కేంద్రాన్ని విస్తరిస్తోందని అభిప్రాయపడింది. అణ్వాయుధ కేంద్రం విస్తరణకు సంబంధించిన కొన్ని ఫొటోలను తాను విశ్లేషించానని, అవి ఆందోళన కలిగిస్తున్నాయని రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ సునీల్ ననోడ్కర్, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ రవికుమార్ గుప్తా వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశంపై భారత్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించకూడదని వారు సూచించారు. భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల కంటే కూడా వాటి సంఖ్యను పెంచుకునే ప్రయత్నాల్లో పాకిస్తాన్ ఉందనే విషయం స్పష్టమైందని అన్నారు. యుద్ధం అంటూ చోటు చేసుకుంటే పాకిస్తాన్ ప్రథమ లక్ష్యం భారతే అవుతుందని చెప్పారు.