షేక్హ్యాండ్: ఆడ, మగ కవులకు కొరడా దెబ్బలు!
టెహ్రాన్: సాంప్రదాయ ఇరాన్ దేశంలో కవులకు, కళాకారులకు కష్టకాలం కొనసాగుతూనే ఉంది. కోర్టు తీర్పులతో అక్కడి ప్రభుత్వం కవుల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోంది. తాజాగా ఆడ, మగ కవులు షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకున్నారనే కారణంగా వారికి కొరడా దెబ్బల శిక్ష విధించింది. ఈ మేరకు అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది.
మిగతా కవులతో షేక్ హ్యాండ్ చేసినందుకు.. ప్రముఖ రచయితలు ఫాతిమా ఏక్తేసరీ, మోహిదీ ముసవి జంటకు ఇరాన్ కోర్టు కఠినమైన శిక్షను విధించింది. ఈ ఇద్దరికీ 99 కొరడా దెబ్బలు అమలు చేయాలని ఆదేశించింది.
గతంలో ఈ జంట కవులు ప్రభుత్వ అనుమతితోనే పుస్తకాలను ప్రచురించారు. అయితే ఇటీవల ఇరాన్లో రచయితలపై అణిచివేత విపరీతంగా పెరిగిపోయింది.
గత ఏడాది 30 మంది జర్నలిస్టులకు ఇరాన్ ప్రభుత్వం ఈ శిక్ష అమలు చేసింది. దేశాధ్యక్షుడు హసన్ రోహానీ పాలనలో కవులపై ఎదురుదాడి మరింత ముదిరిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.