coronavirus: వుహాన్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు, పోలీసు వాహనం పడేసి మరీ, ఎందుకంటే..?
వుహాన్.. కరోనా వైరస్ రక్కసి ఆవిర్భవించింది ఇక్కడే. శనివారం రోజున ఇక్కడ స్థానికులు రెచ్చిపోయారు. గతేడాది డిసెంబర్లో వుహాన్లో వైరస్ ప్రబలిన సంగతి తెలిసిందే. అది మెల్లగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. వుహాన్లో లాక్డౌన్ విధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం నమోదు కాలేదు.
రెండు నెలల తర్వాత నగరంలో ఆంక్షలు ఎత్తివేశారు. నగరంలో సిటీ బస్సులకు అనుమతిచ్చారు. కానీ సిటీ దాటి వెళ్లేందుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో స్థానికులు అధికారుల తీరుపై భగ్గుమన్నారు. తమను బస్సులు, మెట్రోలలో వెళ్లేందుకు అనుమతిచ్చి.. సిటీ దాటేందుకు మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. వుహాన్తో కలిసి ఉన్న హుబే ప్రావిన్స్లో పోలీసు వాహనాన్ని స్థానికులు పడేసి తమ ఆందోళనను తెలియజేశారు. వైరస్ బయటపడిన తర్వాత వుహాన్లోకి రాకపోకలను నిషేధించారు. కానీ శనివారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చినా.. స్థానికులు ఆందోళన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలీసులతో స్థానికులు ఘర్షణ పడే వీడియో స్పష్టంగా కనిపించింది. యంగ్జీ నదికి అడ్డంగా ఉన్న వంతెనపై అడ్డంగా ఉన్న అధికారులపై స్థానికులు విరుచుకుపడ్డారు. తమను ఆపుతారా అని వాహనాన్ని బోల్తా కొట్టించారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. హుబే నుంచి జియాంగ్జీలోకి ప్రవేశించడానికి అధికారులు నిరాకరించడంతో సమస్య ప్రారంభమైందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
వుహాన్లో వైరస్ బయటపడిన తర్వాత పరిస్థితి దారుణంగా ఉంది. జనవరిలో అయితే 11 మిలియన్ల మందిని లాక్ డౌన్ చేశారు. రోడ్లను మూసివేసి, ఫెన్సింగ్ వేసి మరీ వైరస్ను అదుపులోకి తీసుకొచ్చారు. కరోనా వైరస్ దాదాపు 200 దేశాలకు వ్యాపించి 6 లక్షల మందికి సోకింది. వైరస్ బారిన పడి 27 వేల పైచిలుకు మంది చనిపోయారు. చైనాలో 80 వేల మందికి వైరస్ సోకగా.. 3 వేల 2 వందల వరకు మృత్యువాతపడ్డారు.