నిల్చునే నిద్రపోయిన దేశాధినేత ముగాబే!(వీడియో)
టోక్యో: జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే, షింజో అబే మాట్లాడుతుండగా అలసిపోయినట్లుగా కనిపించిన ముగాబే ఓ కునుకు వేశారు. అబే పక్కనే ఉన్న ఆయన నిల్చునే కాసేపు నిద్ర పోయారు.
కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్ వైరల్ మారింది. అయితే, రాబర్ట్ ముగాబే వయస్సు, చాలా దూరం ప్రయాణం చేసిన కారణంగా అలసిపోయి ఇలా కునుకు తీసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. కాగా, ముగాబే నిద్రపోలేదని ఆ దేశ ప్రతినిధులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే.. జపాన్ ప్రధాని షింజో అబే ఆహ్వానం మేరకు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(92) జపాన్ లో పర్యటనకు వెళ్లారు. ఆఫ్రికా అభివృద్ది కోసం ప్రతి ఏడాది నిర్వహించే టోక్యో అంతర్జాతీయ సదస్సు(టీఐసీఏడీ) ఈ ఏడాది అగస్టులో కెన్యాలో జరుగనుంది. దీనిలో భాగంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల గురించి వివరించడానికి టోక్యోలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
జపాన్, జింబాబ్వే దేశాల దౌత్య సంబంధాల బలోపేతం గురించి అబే మాట్లాడారు. ఆఫ్రికాకు ముగాబే ఒక దిగ్గజంగా అభివర్ణిస్తూ మాట్లాడుతుండగా.. నిలబడే ఉన్న ముగాబే కునుకు తీసినట్టు స్పష్టంగా కనిపించింది. తనకు కుడి వైపు నిద్రమత్తులో అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉన్న ముగాబేను ఒక్కసారి అలా చూసి చూడనట్టు అబే చూశారు.
కొంత అసహనానికి గురి అయినట్టు కూడా కనిపించింది. నిలబడే ఓ దేశ అధ్యక్షుడు కునుకు తీశారా? అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ ప్రారంభం అవ్వడంతో జింబాంబ్వే సమాచార మంత్రిత్వ శాఖ వివరణ కూడా ఇచ్చుకుంది. ఆ సమయంలో ముగాబే నిద్రపోవడం లేదని కేవలం అక్కడ జరగబోయే ఒప్పందాల గురించి ఆలోచిస్తున్నారని తెలిపింది.
మీడియా సమావేశంలో ఎవరైనా నిద్రపోతారా ? ముగాబేను అగౌరవ పరిచేలా వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఒక ప్రకటనను విడుదల చేసింది.అయితే ముగాబే ఇలాంటి సంఘటనలో మీడియా కంటికి చిక్కడం మొదటిసారేం కాదు. ఆఫ్రికా యూనియన్ శిఖరాగ్రసమావేశంలోనూ పలువురు ముఖ్యులు ప్రసంగిస్తున్న సమయంలో కూడా నిద్రపోయారు.