దేశాధినేత జన్మదిన వేడుక: ఏనుగు, సింహం, మొసలి మాంసంతో విందు
లండన్: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే జన్మదిన వేడుకల్లో ఇచ్చిన విందు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలలు అష్టకష్టాల్లో ఉన్న ఈ దేశంలో ఆ దేశ అధ్యక్షుడు ముగాబే మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇది ఆయనకు 91వ పుట్టిన రోజు.
తన జన్మదిన వేడుకలు ప్రత్యేకంగా ఉండాలని ఏనుగులను, సింహాన్ని, రెండు గేదెలను, మొసలిని, 40 ఆవులను బలిచ్చి వాటి మాంసంతో విందు ఏర్పాటు చేశాడు. రెండువేల మంది అతిథులకు దాన్ని వడ్డించాడు. ఆయన శనివారం 91వ పుట్టినరోజును జరుపుకొన్నారు. విందుకు 20 వేల మందిని ఆహ్వానించారు. విందులో మహా రుచిగా ఉండాలని రెండు ఏనుగులు, ఒక సింహం, ఒక మొసలి, 40 ఆవుల మాంసాన్ని మెనుగా పెట్టారు. భారీ కేక్ను కట్ చేశారు.
జన్మదిన వేడుక కోసం ఆయన మొత్తంగా రూ. 10కోట్లు ఖర్చుచేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తినడానికి తిండి కూడా లేక దేశ ప్రజలు అల్లాడుతుంటే అధ్యక్షుడు ఇలా కోట్ల రూపాయలు ఖర్చు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముగాబే మీద అభిమానంతో జన్మదిన వేడుకల విందు కోసం ఓ రైతు ఏనుగులను, సింహాన్ని, మొసలిని ఇచ్చాడని అంటున్నారు. పలువురు నాయకులు ఆవులను ఇచ్చారని చెబుతున్నారు.
ముగాబే జన్మదిన వేడుకలు ప్రత్యేకమైన లాడ్జి, స్పా, గోల్ఫ్ కోర్సులో జరిగాయి. 91వ జన్మదిన వేడుకలకు గుర్తుగా ఆయన తన భార్య గ్రేస్తో కలిసి 91 బెలూన్లను గాలిలోకి ఎగురేశారు. మానవ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి.