9/11 దాడుల రోజునే: కాబుల్లోని అమెరికా ఎంబసీ వద్ద పేలిన రాకెట్
అఫ్ఘానిస్తాన్ : అఫ్ఘానిస్తాన్లోని అమెరికా ఎంబసీ వద్ద ఓ రాకెట్ పేలింది. 9/11 అమెరికాపై దాడులు జరిగి 18 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పేలిన ఈ రాకెట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాకెట్ పేలుడును నిర్థారిస్తూనే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. సెంట్రల్ కాబుల్లో అర్థరాత్రి ముందుగా దట్టమైన పొగ రావడంతో సైరన్ మోగింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఈ సైరన్ను లౌడ్ స్పీకర్ ద్వారా విన్నారు.
ఇదిలా ఉంటే ఘటన జరిగిన వెంటనే అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దగ్గరలోనే ఉన్న నాటో మిషన్ అధికారులు కూడా ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్థారించారు. కొద్దిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా తాలిబన్ల మధ్య చర్చలు ఇక ఉండబోవని పిలుపునిస్తూ వారిపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న దాడులను నిలిపివేయాలని నిర్ణయించిన తర్వాత జరిగిన తొలి ఘటన ఇది.
మరోవైపు రెండు తాలిబన్ కారు బాంబులు గతవారం కాబుల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ బాంబు పేలుళ్లతో చాలామంది పౌరులు మృతి చెందారు. అంతేకాదు నాటో మిషన్ పై ఉన్న ఇద్దరు అధికారులు కూడా మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన ట్రంప్ తాలిబన్లు అమెరికాల మధ్య చర్చలు చచ్చిపోయాయంటూ తీవ్రంగా స్పందించారు.
9/11 అనే తేదీ అఫ్ఘానిస్తాన్లో చాలా సున్నితమైన రోజు. ఈ రోజునే 2001లో అమెరికాపై లాడెన్కు చెందిన ఆల్ఖైదా సంస్థ డబ్ల్యూటీఓ, ట్విన్ టవర్స్పై విమానాలతో దాడులు చేసింది. దాడుల తర్వాత వెంటనే అమెరికా తాలిబన్లను అనుమానిస్తూ వారిపై దాడులకు దిగింది. అయితే ఆ తర్వాత లాడెన్ అని తెలుసుకుని ఆయన కోసం వేట సాగించింది. ఇప్పటికీ అఫ్ఘానిస్తాన్లో 14వేల మంది అమెరికా సైన్యం ఉంది. వారందరినీ ట్రంప్ వెనక్కు పిలిచారు. ఇప్పటి వరకు వారిపై కొన్ని బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ఏమీ సాధించలేకపోవడం నిజంగా బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ఈ ఘటనతో అమెరికా - తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతాయా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.