మరోసారి బాగ్దాద్లో క్షిపణుల దాడులు: అమెరికా ఎంబసీ సమీపంలోనే..
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి క్షిపణి దాడులతో దద్దరిల్లింది. బాగ్దాద్ గ్రీన్ జోన్ పరిధిని రెండు క్షిపణులు తాకాయి. అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అమెరికా సైన్యం ఉన్నట్లు తెలిసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు తెలియరాలేదు.
శనివారం ఉదయం కూడా ఇరాక్ లో ఇరాన్ మద్దతున్న పారామిలిటరీ బలగాల కాన్వాయ్ పై వైమానికి దాడులు జరిగాయి. శుక్రవారం ఉదయం బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్కు శక్తివంతమైన కమాండర్గా ఉన్న జనరల్ ఖాసీం సులేమానీ(62) మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో షహీద్ ఆల్ షాబీ దళ డిప్యూటీ చీఫ్ అబూ మహదీ అల్ మొహందిస్ తోపాటు మొత్తం 10 మంది చనిపోయారు. దీంతో స్పందించిన ఇరాన్ తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. అయితే, ఇరాన్ కు యుద్ధంలో గెలిచేంత శక్తి లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పేశారు.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే చమురు ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని భారత్ తోపాటు ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.