ఇండియా ఎంబసీపై రాకెట్ దాడి: సిబ్బంది సురక్షితం
కాబూల్: అఫ్గానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎంబసీ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఓ రాకెట్ పడింది. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ధృవీకరించింది.
కాబూల్లోని ఇండియా ఎంబసీ కార్యాలయ ప్రాంగణంలో ఓ రాకెట్ ల్యాండ్ అయ్యింది. దీంతో భవనం స్వల్పంగా దెబ్బతింది. ఎలాంటి మంటలు చోటుచేసుకోలేదు. ఎంబసీ సిబ్బందంతా సురక్షితంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు.
విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. భవనం పై భాగంలో రాకెట్ పడినట్లు తెలిపారు.అయితే ఈ రాకెట్ను ఎవరు ప్రయోగించారు.భారత ఎంబసీని లక్ష్యంగా చేసుకునే రాకెట్ వేశారా అన్న విషయాలపై స్పష్టత రాలేదు.
పొరపాటున ఈ రాకెట్ పడిందా, లేకపోతే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ రాకెట్ను భారత ఎంబసీ కార్యాలయంపై దాడి చేశారా అనే విషయమై తేలాల్సి ఉందని అధికారులు ప్రకటించారు.