అమెరికా ఎంబసీకి సమీపంలో దూసుకొచ్చిన మూడు రాకెట్లు...ఇరాన్ రియాక్షన్ ఏంటి..?
Recommended Video
బాగ్దాద్: కొద్ది రోజులుగా నిశబ్దంగా ఉన్న ఇరాన్ మళ్లీ విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ హై సెక్యూరిటీ గ్రీన్ జోన్లో ఉన్న అమెరికా ఎంబసీకి సమీపంలో మూడు రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో కార్యాలయాల సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. గ్రీన్ జోన్ సెంట్రల్ బాగ్దాద్ ప్రాంతంలో ఉంది. ఇక్కడే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ఉన్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖాసిం సొలేమనిపై ఈ నెల 3వ తేదీన డ్రోన్లతో దాడి చేసి అమెరికా బలగాలు హతమార్చాయి. ఇందుకు ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ కూడా ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది.
ఇదిలా ఉంటే ఇరాక్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కొందరు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఇరాకీ బలగాలు వారిపైకి భాష్పవాయువును ప్రయోగించాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మరోవైపు గ్రీన్ జోన్లోకి మూడు కత్యూషా రాకెట్లు దూసుకొచ్చాయి. ఇక ఆందోళనలు తీవ్రతరం కావడంతో అధికారులు రాజధాని బాగ్దాద్కు వెళ్లే ప్రధాన రహదారులను మూసివేశారు. ఇరాన్ అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తర్వాత ఇరాక్లో తాజాగా ఘర్షణలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. బాగ్దాద్లోని సినాక్ బ్రిడ్జ్ వద్ద భాష్పవాయువు, కాల్పులు జరిగాయి. నిరసన తెలుపుతున్న ఒకరు బుల్లెట్ గాయాలతో మృతి చెందగా మరొకరు భాష్పవాయువు కానిస్టర్ తగిలి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మూడో వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు.
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాక్ చేసిన క్షిపణి దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అమెరికా సైన్యంకు చెందిన 11 దళాలకు తీవ్ర గాయాలయ్యాయని అమెరికా మిలటరీ వెల్లడించింది. ఖాసి మృతితో ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మొత్తానికి అమెరికాను దెబ్బకు దెబ్బ తీసేందుకు ఇరాన్ మిలటరీ వ్యూహాలు రచిస్తోంది. అంతేకాదు అమెరికాకకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణమైనా ఇరాన్ రెచ్చిపోయే అవకాశం ఉన్నందున అమెరికా కూడా ముందస్తు జాగ్రత్తతో వ్యవహరిస్తోంది.