చెంపలు వాయిస్తా!, 16ఏళ్లకే హత్య చేసినోన్ని, తగ్గేది లేదు: రొడ్రిగో సంచలన వ్యాఖ్యలు
డ్రగ్స్ తో ఎవరు పట్టుబడినా.. కనిపించినా మరో మాట లేకుండా కాల్చి పారేయాల్సిందేనని రొడ్రిగో ఆదేశాలు జారీ చేశారు.
మనీలా: డ్రగ్స్పై ఉక్కుపాదం మోపిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె 'షూట్ ఎట్ సైట్స్' ఆర్డర్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఫిలిప్పీన్స్లో డ్రగ్స్ బానిసలను నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తున్నారు.
ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పినా.. తన పంథాను విమర్శించినా.. రొడ్రిగో మాత్రం అవేవి పట్టించుకోవడం లేదు. సరికదా.. అలాంటి మాటలను చెప్పేవాళ్ల చెంపలు వాయిస్తానని కూడా అంటున్నాడు. తాజాగా డ్రగ్స్ విషయంలో తాను తీసుకున్న కఠిన నిర్ణయాన్ని మరోసారి రొడ్రిగో సమర్థించుకున్నారు. దీనికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చెంపలు వాయిస్తా
వియత్నామీల నగరమైన డానాంగ్లో స్థానిక ఫిలిపినో కమ్యూనిటీని ఉద్దేశించి రొడ్రిగో మాట్లాడారు. ఐరాస ప్రతినిధి ఎవరైనా తనను కలిసేందుకు వస్తే వారి చెంపలు వాయిస్తానని హెచ్చరించారు. డ్రగ్స్పై తాను ప్రకటించిన యుద్ధం గురించి ఎవరు మాట్లాడినా వదిలేదన్నారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.
కిమ్ జాంగ్కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?
జైలుకెళ్లడం, రావడం నాకు కామన్
'నేను యువకుడిగా ఉన్న సమయంలో జైలుకు వెళ్లడం, రావడం అనేవి చాలా కామన్ గా జరిగేవి' అని రొడ్రిగో తెలిపారు. తాను టీనేజర్గా ఉన్నప్పుడు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశానని కూడా చెప్పారు. డ్రగ్స్పై యుద్దం ప్రకటించిన రోడ్రిగో మనీలాలో జరగనున్న అంతర్జాతీయ సమ్మిట్కు ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అప్పట్లోనే హత్య.. ఇప్పుడు నేనో అధ్యక్షుడిని
16ఏళ్లు ఉన్నప్పుడే హత్య చేశాను.. ఇప్పుడు నేనో అధ్యక్షుడిని అంటూ తీవ్ర స్వరంతో రొడ్రిగో వ్యాఖ్యానించారు. కాగా, గతేడాది అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి రొడ్రిగో.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. దేశం నుంచి డ్రగ్స్ ను తరిమేయాలంటే.. వాటికి బానిసలైన వారిని చంపేయాల్సిందేనని ఆదేశించాడు.
లక్షమంది హతం
డ్రగ్స్ తో ఎవరు పట్టుబడినా.. కనిపించినా మరో మాట లేకుండా కాల్చి పారేయాల్సిందేనని రొడ్రిగో ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి తన కొడుకైనా సరే ఉపేక్షించవద్దన్నారు. ఈ నేపథ్యంలో 2017లొ దాదాపు లక్ష మందిని అక్కడి పోలీసులు చంపేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం తాము 3,967 మందిని చంపేశామని, మరో 2,290 మంది డ్రగ్ సంబంధ నేరాల్లో హత్యకు గురయ్యారని చెబుతున్నారు.