బతుకుజీవుడా!: ఆ ప్లాస్టిక్ డబ్బాలతోనే దేశం దాటుతున్నారు.. మయన్మార్ ధీన గాథ..
మయన్మార్లో ముస్లింల జీవితం దినదినగండంగా పరిణమించింది. ఉగ్రవాదులు అన్న ముద్ర వారిని క్షణక్షణం వెంటాడుతూనే ఉంది. పుట్టిన గడ్డ పైనే రక్షణ లేని స్థితిలో మరో గడ్డ మీదకు వలసవెళ్లాల్సిన పరిస్థితి.
మయన్మార్: మయన్మార్లో ముస్లింల జీవితం దినదినగండంగా పరిణమించింది. ఉగ్రవాదులు అన్న ముద్ర వారిని క్షణక్షణం వెంటాడుతూనే ఉంది. పుట్టిన గడ్డ పైనే రక్షణ లేని స్థితిలో మరో గడ్డ మీదకు వలసవెళ్లాల్సిన పరిస్థితి.
ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలతో సముద్రాన్ని ఈదుకుంటూ రోహింగ్యాలు ఇప్పుడు బంగ్లాదేశ్ చేరుకుంటున్నారు. అక్కడ కూడా వీరిని అనుమతించడంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. దీంతో రోహింగ్యా ముస్లింల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయిన దుస్థితి తలెత్తింది.
ప్లాస్టిక్ డబ్బాతోనే
మయన్మార్కు చెందిన నబీ హుస్సేన్(13) కేవలం ఒక ప్లాస్టిక్ డబ్బా సహాయంతో సముద్ర మార్గం గుండా 2.5మైళ్ల దూరం వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నాడు. నబీ లాగే ఎంతోమంది చిన్నారులు ఇప్పుడు ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు చేతపట్టుకుని, నాలుగు రోజుల పాటు తిండి, నిద్ర, దాహం వంటివి పక్కనబెట్టి.. సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశ్ ఆధీనంలోని షా పొరిర్ ద్వీపానికి చేరుకుంటున్నారు.
తల్లిదండ్రులే పంపిస్తున్నారు
మయన్మార్ లో ఉండటం ఎప్పటికైనా తమ ప్రాణాలకు ముప్పేనని అక్కడి ముస్లింలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ కన్నబిడ్డలను దేశం దాటి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. నబీని కూడా అతని తల్లిదండ్రులు అలాగే పంపించారు. అలా ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను నఫా గుండా బంగ్లాదేశ్కు దగ్గరుండి మరీ పంపిస్తున్నారు. 'దేవుడా.. ఇదే నా చివరి రోజు కాకూడదు' అని ప్రార్థిస్తూ ఆ చిన్నారులంతా సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి షా పొరిర్ చేరుకుంటున్నారు.
రోహింగ్యాల ఊచకోత
మయన్మార్ లో ప్రస్తుతం ముస్లింల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. రోహింగ్యాలు అక్రమ చొరబాట్లకు పాల్పడ్డారన్న కారణంతో వారిపై ఉగ్రవాద ముద్రవేసి చిత్రహింసలు పెట్టారు. బౌద్ద సంఘాలు కూడా ఇందుకు జతకలవడంతో వారిని ఊచకోత కోశారు. మహిళలపై అత్యాచారాలు జరిపారు. ఆస్తులను ధ్వంసం చేశారు.
బతుకుజీవుడా:
మయన్మార్ ప్రభుత్వం కూడా రోహింగ్యా ముస్లింలను రక్షించడానికి ప్రత్యేకమైన చర్యలేవి తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. దీంతో మయన్మార్ నుంచి బతుకుజీవుడా అనుకుంటూ రోహింగ్యాలంతా బంగ్లాదేశ్ బాట పడుతున్నారు. మరికొంతమంది భారత్ లోను అడుగుపెడుతున్నారు. అయితే భారత్ లోను వీరికి చుక్కెదురవుతున్న పరిస్థితి.