రష్యాలో అదరగొట్టిన భారత బలగాలు.. మాస్కో రెడ్ స్క్వేర్ లో 75వ విక్టరీ డే పరేడ్.. చైనా కూడా..
రష్యా రాజధాని మాస్కో నగరంలో చారిత్రక రెడ్ స్క్వేర్ వద్ద భారత త్రివిధ దళాలు కదంతొక్కాయి. ప్రతిష్టాత్మక విక్టరీ పరేడ్ లో మన బలగాలు అదరగొట్టాయి. కరోనా తర్వాత ప్రపంచలో తొలిసారిగా జరుగుతోన్న పెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే కావడంతో ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సేనలపై సోవియెట్ రష్యా విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రష్యా మిలటరీ నేతృత్వంలో బుధవారం మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద విక్టరీ డే పరేడ్ ఘనంగా జరిగింది.
Recommended Video
ఇటు కరోనా..అటు చైనా.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న మోదీ.. డ్రాగన్ కు షాక్ తప్పదా?
మొత్తం 11 దేశాలు..
75వ విక్టరీ డే పరేడ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న రష్యా.. నాటి యుద్ధంలో తనకు సహకరించిన మరో 11 దేశాల సైనిక బృందాలను కూడా ఆహ్వానించింది. ఆమేరకు భారత్, చైనా సహా 11 దేశాల సైనికుల బృందాలు కవాతులో పాల్గొన్నాయి. ముందుగా భారత్, ఆ వెనకాలే చైనా... అలా మొత్తం వివిధ దేశాల సైనికుల బృందాలు పరేడ్ లో ముందుకు కదిలాయి. రష్యా ఆయుధ సంపత్తి ప్రదర్శన, వాయుసేనల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
గర్వంగా ఉంది..
రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి గుర్తుగా నిర్వహిస్తోన్న 75వ విక్టరీ పరేడ్ లో భారత త్రివిధ దళాలకు చెందిన బృందాలు కూడా పాల్గొనడం గర్వంగా ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మూడురోజుల మాస్కో పర్యటనలో ఉన్న ఆయన.. రష్యా జాతీయ అతిథిగా బుధవారం రెడ్ స్క్వేర్ లో జరిగిన కవాతును తిలకించారు. నాటి యుద్ధంలో రష్యాకు మద్దతుగా వేల మంది భారత సైనికులు కూడా పోరాడటం, ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. శాంతి స్థాపన కోసం వారు చేసిన త్యాగాలు మరువలేనివని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.
భారీ ఈవెంట్ లోనూ అది తప్పలేదు..
కరోనా విజృంభణ తర్వాత ప్రత్యక్షంగా జరిగిన జరిగిన తొలి అంతర్జాతీయ ఈవెంట్ కావడంతో రష్యా విక్టరీ డే పరేడ్ లో సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పకడ్బందీగా అమలు చేశారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సహా ప్రపంచ దేశాల నుంచి అతిరధులెందరో హాజరైన ఈ వేడుకలో మాస్కులు, శానిటైజర్ వాడకాన్ని తప్పనిసరి చేశారు. అతిథుల దగ్గర్నుంచి సామాన్య ప్రజలు కూర్చునే గ్యాలరీల్లోనూ డిస్టెన్స్ పాటించారు. మొత్తం 6 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసుల నమోదుతో రష్యా ప్రపంచంలోనే 3వ స్థానంలో కొనసాగుతున్నది. కొవిడ్-19 వ్యాది కారణంగా అక్కడ ఇప్పటివరకు 8,513మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్ ప్రతిపాదనకు పచ్చజెండా..
విక్టరీ డే పరేడ్ కోసం రష్యాకు వెళ్లిన రాజ్ నాథ్.. రక్షణ రంగంలో ఒప్పందాలపైనా చర్చలు జరిపారు. రష్యా ఉప ప్రధాని యూరీ ఇవనోవిచ్ బోరిసోవ్ తోపాటు ఆ దేశ రక్షణ శాఖ అధికారులతో మంగళవారం విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ చేసిన ప్రతిపాదనలన్నిటికీ గ్రీన్ సిగ్నల్ లభించినట్లు రాజ్ నాథ్ వెల్లడించారు. భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోన్న 400 క్షిపణి నిరోధక వ్యవస్థ అందజేత, సుఖోయ్, మిగ్ విమానాలకు అవసరమైన విడిభాగాల సరఫరా తదితర అంశాలపై ఆయన మాట్లాడినట్లు వెల్లడైంది.