తొలి దశ యుద్దం ముగిసింది : తరువాతి లక్ష్యం ఇదే - సేనల నష్టం పైనా : రష్యా ప్రకటన..!!
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించి నెల రోజులు దాటింది. ఇప్పటి వరకు తొలి దశ పూర్తి కావచ్చిందని రష్యా అధికారికంగా ప్రకటించింది. తమ తదుపరి లక్ష్యం ఏంటో స్పష్టత ఇచ్చింది. యుద్ధంలో చనిపోయిన మాస్కో సేనల సంఖ్యపై రష్యా అధికారిక ప్రకటన చేసింది. 30వ రోజు ఖర్కివ్ సహా పలు నగరాల్లో దాడులు నిర్వహిచింది. ఖర్కివ్లో మానవతా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన క్లినిక్పై రష్యా బలగాలు జరిపిన రాకెట్ లాంఛర్ల దాడిలో నలుగురు చనిపోయారు. కీవ్ వెలుపల ఉన్న ఉక్రెయిన్ ప్రధాన ఇంధన డిపోను క్షిపణులతో ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ బలగాల ప్రతిఘటనతో కీవ్ శివార్లలో మాస్కో సేనలు వెనక్కితగ్గినట్లు బ్రిటన్ రక్షణ శాఖ ప్రకటించింది.
నెక్స్ట్ టార్గెట్ డాన్బాస్
ఇక, తొలి దశ యుద్దం ముగింపుకు వచ్చిందని చెప్పిన రష్యా తమ నెక్స్ట్ టార్గెట్ డాన్బాస్ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడమేనని స్పష్టం చేసింది. ఇప్పటివరకు 16,100 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దీంతోపాటు 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది.
ఇదే సమయంలో రష్యా సైతం తమ సైన్యానికి జరిగిన నష్టం గురించి వెల్లడించింది. ఇప్పటివరకు 1,351 మంది మాస్కో బలగాలు చనిపోయినట్లు రష్యా మిలటరీ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ప్రకటించారు. మరో 3,825 మందికి గాయాలైనట్లు స్పష్టం చేశారు. 16వేలకు పైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది.
రాష్యా సేనలకు సైతం భారీ నష్టం
అటు నాటో కూటమి కూడా 7 వేల నుంచి 15 వేలమంది పుతిన్ సేనలు మరణించినట్లు పేర్కొంది. ఐరోపా పర్యటనలో భాగంగా చివరగా బైడెన్ పోలాండ్కు చేరుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్లోని రెజెస్జో నగరానికి బైడెన్ వచ్చారు. పోలాండ్- ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న అమెరికా సైన్యంతో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి పోలాండ్కు వలస వెళ్తున్న శరణార్థులకు సాయం అందించడంపై చర్చించనున్నారు.
అమెరికా సైన్యం, ప్రభుత్వేతర సంస్థలు ఉక్రెయిన్ నుంచి పోలాండ్కు వచ్చే వారికి సహాయం చేస్తున్నాయి. కీవ్కు తూర్పున 35కిలోమీటర్ల వరకు పట్టణాలు, రక్షణ స్థావరాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా 1200 క్షిపణులు ప్రయోగించగా అందులో సగానికిపైగా గురి తప్పినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
యుద్దం కొత్త టర్న్ తీసుకుంటుందా
ఇక, ఇప్పుడు రెండో దశ యుద్దం అంటున్న రష్యా పై అమెరికా సహా పలు ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా, రష్య వెనక్కు తగ్గటం లేదు. ఇప్పుడు డాన్బాస్ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి తమ లక్ష్యమని చెబుతున్న రష్యా యుద్దంలో ముందుకు ఎలాంటి వ్యూహాలతో వెళ్తుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది. దీని ద్వారా యుద్దం మరింత కాలం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే పోలండ్ పర్యటనలో ఉన్న బైడెన్.. తీవ్రంగా విరుచుకుపడుతున్న బ్రిటన్ ప్రధాని... ఇప్పుడు రష్యాను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు ప్రతిపాదిస్తారనేది వేచి చూడాలి.