భారత్ కు రష్యా మద్దతు : 'ఉగ్రవాదులు 'పాక్' అని తొలుత చెప్పింది మేమే'
మాస్కో : భారత్ పై కక్షగట్టిన పాక్ కు షాక్ ఇచ్చేలా.. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో దేశానికి మద్దతు పలికింది రష్యా. ఈ మేరకు భారత్ కు మద్దతుగా దేశంలోని రష్యా రాయబార కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. సర్జికల్ స్ట్రైక్స్ పై స్పందించిన భారత్ లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం కదకిన్.. యూరీలో భారత సైనికులను హతమార్చిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు మొట్టమొదట బహిరంగంగా ప్రకటించిన దేశం రష్యాయేనని పేర్కొన్నారు.
భారతదేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు తాము వ్యతిరేకమని ఈ సందర్బంగా కదకిన్ స్పష్టం చేశారు. ముందునుంచి ఈ విషయాన్ని తాము బహిరంగగానే వ్యక్తపరుస్తున్నామని ఆయన గుర్తుచేశారు. ఉగ్రచర్యల నుంచి ఏ దేశమైనా తమను కాపాడుకోవాల్సిందేనన్న కదకిన్.. భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ను సమర్థించారు. భారత్ కు వ్యతిరేకంగా చేపడుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని తక్షణం ఆపేయాల్సిందిగా పాకిస్థాన్ కు ఆయన సూచించారు.
ఇక కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని దౌత్య వేదికలపై భారత్ పై ఆరోపణలు గుప్పిస్తోన్న పాక్ వాదనపై స్పందిస్తూ.. ఉగ్రవాద దాడులే అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనలు అని స్పష్టం చేశారు. 'సైనిక స్థావరాలపైనా, భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న ప్రజలపైనా ఉగ్రవాద దాడులు చేయడం అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనల' అని కదకిమ్ అభిప్రాయపడ్డారు.