ఇక అమెరికాతో చర్చల్లేవ్: రష్యా ప్రకటన, మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం!?
మాస్కో: అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య విభేదాలు మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా రష్యా తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం. ఈ నెలలో అమెరికాతో జరగబోయే వ్యూహాత్మక చర్చలను రష్యా రద్దు చేసింది.
అంతేకాదు, అమెరికా తీరు వల్లే తాము చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నిజానికి మార్చి 6, 7 తేదీల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అమెరికా, రష్యా మధ్య చర్చలకు షెడ్యూల్ ఖరారైంది.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించేందుకు నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికాలో రష్యా రాయబారి అనాటోలీ ఆంటోనోవ్ తెలిపారు.
'ఇటీవల సైబర్ సెక్యూరిటీపై జెనీవాలో జరిగిన సమావేశం నుంచి అమెరికా చివరి నిమిషంలో తప్పుకుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో రెండు దేశాల మధ్య చర్చలు జరగడం అసాధ్యమని రష్యా భావించింది..' అని ఆంటోనోవ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా రష్యా కొత్తతరం హైపర్సోనిక్ ఆయుధాలు, సబ్మెరైన్లను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. దీనిపై అమెరికా కూడా భగ్గుమంటోంది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఒప్పందాలను రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపణలు చేసింది.
అయితే అమెరికా చేసిన ఆరోపణలపై కూడా అమెరికాలో రష్యా రాయబారి అనాటోలీ ఆంటోనోవ్ స్పందించారు. తాము ఎలాంటి ఒప్పందాలను ఉల్లంఘించడం లేదని పేర్కొన్నారు. పుతిన్ తాజాగా ప్రకటించిన ఏ ఆయుధం కూడా ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఒప్పందంలో లేదని వ్యాఖ్యానించారు.