వామ్మో.. మనుష్యులకు బర్డ్ ప్లూ, రష్యాలో వెలుగులోకి..
కరోనా అంటేనే వెన్నులో వణుకు వస్తోంది. అదీ మరవక ముందే మరిన్ని ఉపద్రవాలు వస్తున్నాయి మానవుల్లో తొలి బర్డ్ ఫ్లూ కేసును రష్యాలో గుర్తించారు. ఇన్ఫ్లూయెంజా ఎ వైరస్లోని H5N8 స్ట్రెయిన్ను వెక్టార్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్డ్ఫ్లూకు కారణమయ్యేది ఇదేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవుల్లో తొలి బర్డ్ఫ్లూ కేసును గుర్తించారని.. ఎవియన్ ఇన్ఫ్లూయెంజా ఎ వైరస్ స్ట్రెయిన్ H5N8 హ్యూమన్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన తొలి కేసు అని వినియోగదారుల హక్కుల రక్షణ వాచ్డాగ్ రెస్పోట్రెబ్నాడ్జర్ హెడ్ అన్నా పొపోవా తెలిపారు.
పక్షుల్లో చాలా ప్రమాదకరమైన వ్యాధి అయిన ఇది ఇప్పటి వరకు మానవుల్లో కనిపించిన దాఖలాలు కనిపించలేవు. రష్యా దక్షిణ ప్రాంతంలో డిసెంబర్లో బర్డ్ ఫ్లూ వెలుగు చూడగా, ఓ పౌల్ట్రీ ఫామ్లోని ఏడుగురు ఉద్యోగుల్లో ఈ ఫ్లూ జాతి జన్యు పదార్థాన్ని శాస్త్రవేత్తలు వేరు చేశారు. కొద్దిపాటి క్లినికల్ లక్షణాలు తప్ప ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని పొపోవా తెలిపారు.
భవిష్యత్తులో ఈ వైరస్ పరివర్తన చెందుతుందనే అంశానికి సంబంధించి కాలమే సమాధానం చెబుతుందని పొపోవా పేర్కొన్నారు. ఇటీవల భారత్లోనూ బర్డ్ఫ్లూ కలకలం రేపింది. దేశంలోని చాలా రాష్ట్రాలు బర్డ్ఫ్లూ దెబ్బకు వణికిపోయాయి. కట్టుదిట్టమైన చర్యల కారణంగా ఆ తర్వాత అది నెమ్మదించిన సంగతి తెలిసిందే. కానీ రష్యాలో మానవులకు బర్డ్ ప్లూ సోకడం ఆందోళన కలిగిస్తోంది.