గూఢచారి కుటుంబంపై విషప్రయోగం.. బ్రిటన్, రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధం!
లండన్: బ్రిటన్, రష్యా మధ్యన ఇప్పుడు ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణం నెలకొంది. నర్వ్ ఏజెంట్తో గూఢచారి సెర్గీ స్రిపాల్పై జరిగిన విషప్రయోగ దాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడిలో సెర్గీ స్రిపాల్ కూతురు కూడా అస్వస్థతకు లోనైంది. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బ్రిటన్లోని సాలిస్బర్లో సెర్గీ స్రిపాల్పై వారం రోజుల క్రితం నర్వ్ ఏజెంట్ దాడి జరిగింది. ఈ దాడి కోసం నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్ను వాడారు. అయితే ఇది కేవలం రష్యాలోనే తయారవుతుంది. దీంతో బ్రిటీష్ ఇంటెలిజెన్స్కు గతంలో గూఢచారిగా పనిచేసిన సెర్గీ స్రిపాల్పై కావాలనే రష్యా దాడి చేసిందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
దీన్ని సీరియస్గా తీసుకున్న బ్రిటన్.. రెండు రోజుల క్రితం 23 మంది రష్యా దౌత్యవేత్తలను తమ దేశం నుంచి బహిష్కరించింది. దీంతో బ్రిటన్, రష్యాల మధ్య నువ్వా? నేనా? అన్న వాతావరణం నెలకొంది.
వాస్తవానికి సెర్గీ స్రిపాల్ రష్యాకు చెందినవాడే. రష్యన్ ఆర్మీలో కల్నల్గా కూడా చేశాడు. అయితే గూఢచర్యం ఆరోపణల కింద అతనికి రష్యా 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఎంఐ6కి సెర్గీ అప్పట్లో సమాచారం అందజేశాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
పదేళ్ల శిక్ష అనుభవించిన సెర్గీ స్రిపాల్ 2010లో విడుదలయ్యాడు. ఆ తరువాత అతడు రష్యా నుంచి వచ్చేసి బ్రిటన్లో స్థిరపడ్డాడు. మళ్లీ నెల రోజుల క్రితం రష్యా వెళ్లి వచ్చిన సెర్గీ స్రిపాల్ బ్రిటన్కు చేరుకోగానే అతనిపై నర్వ్ ఏజెంట్తో దాడి చేశారు.
ఈ నేపథ్యంలో కావాలనే రష్యా తమ ఏజెంట్లను టార్గెట్ చేస్తోందని బ్రిటన్ ఆరోపిస్తోంది. మరోవైపు రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా కూడా సమర్థించింది. దీంతో ఇప్పుడిది అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది.
మరోవైపు బ్రిటన్ చర్యపై రష్యా కూడా ప్రతీకార చర్యకు దిగనుంది. తమ దేశంలోని బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించేందుకు తాము కూడా సిద్దంగా ఉన్నామని తాజాగా రష్యా ప్రకటించింది.