మధ్యాకాశంలో రెండు యుద్ధ విమానాలు ఢీ.. పైలట్ల పరిస్థితి ఏంటో తెలుసా..?
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో కూడా అధికారులు పసిగట్టలేకున్నారు. తాజాగా రెండు యుద్ధ విమానాలు గాల్లో ఉండగానే ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళితే... రష్యాకు చెందిన ఎస్యూ-34 యుద్ధ విమానాలు గాల్లో శిక్షణ పొందుతుండగా ఢీకొన్నాయి. ఈ ఘటన జపాన్ సముద్ర తీర ప్రాంతంలో జరిగింది.
రెండు యుద్ధ విమానాలు శిక్షణ పొందుతుండగా ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు రష్యా మిలటరీ అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది విమానంలోనుంచి దూకేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఓ పైలట్ ఓ చెక్కను పట్టుకుని సముద్రంలో సహాయం కోసం ఎదురు చూసినట్లు అధికారులు వెల్లడించారు. ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్ వేస్తూ కనిపించడంతో ఆయన్ను కనుగొన్నామని అయితే అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందుకు వాతావరణం అనుకూలించడం లేదని అధికారులు వివరించారు.
ఇదిలా ఉంటే బయటకు దూకిని మిగతా పైలట్ల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందన్నారు మిలటరీ అధికారులు .వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక ఢీకొన్న రెండు విమానాలు కూడా ఎక్కడ పడ్డాయో గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు వివరించారు. అయితే ఈ ఫైటర్ జెట్లు ఎలాంటి క్షిపణులు మోసుకెళ్లలేదని స్పష్టం చేశారు అధికారులు. ఇవి కేవలం శిక్షణ కోసమే వినియోగించినందున పెను ప్రమాదం తప్పిందని అధికారులు స్పష్టం చేశారు.