సిరియా ఇష్యూ, మా మిసైళ్లు వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి: రష్యాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: సిరియా పైన తాము కొత్త, స్మార్ట్ మిసైళ్లను ప్రయోగించనున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ టేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. విషపూరిత వాయువులను ప్రయోగిస్తూ సొంత ప్రజలను చంపుతూ ఆనందిస్తున్న అసద్ అనే మృగం లాంటి వ్యక్తికి రష్యా అండగా నిలుస్తోందా అని ట్రంప్ నిలదీశారు.
తాము మిసైళ్లను ప్రయోగిస్తామని, ప్రణాళికలను మాత్రం చెప్పలేమని వెల్లడించారు. సిరియా సర్కారుకు, ఆ ప్రభుత్వ చర్యలకు రష్యా అధ్యక్షులు పుతిన్ అండాగా ఉండటంపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిరియాలోని దౌమాలో రసాయనిక దాడి జరిగింది. ప్రతీకారంగా సిరియాపై ట్రంప్ దాడి చేయాలని యోచిస్తున్నారు.
మా మిసైళ్లు వస్తున్నాయి జాగ్రత్త
కాగా, సిరియాలో ఇటీవల రసాయన దాడి జరిగి వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు తీవ్రంగా ఖండించిన అమెరికా.. ఈ విషయంలో రష్యాకు గట్టి హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. సిరియాలో రసాయన దాడికి సమాధానం చెప్పేందుకు తమ క్షిపణులు వస్తున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం. రష్యాతో తమ సంబంధాలు ఏమాత్రం బాగా లేవని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆయుధాల రేసును ఆపాలని సూచించారు.
సిరియా మీదకు వచ్చే క్షిపణులను ధ్వంసం చేస్తాం
దీనిపై లెబనాన్కు చెందిన రష్యా అంబాసిడర్ ఘాటుగా స్పందించారు. సిరియా మీదకు వచ్చే ఎలాంటి క్షిపణిని అయినా ధ్వంసం చేస్తామన్నారు. సిరియాకు వచ్చే అన్ని క్షిపణులను కూల్చేస్తామని రష్యా శపథం చేసింది.
రష్యా సిద్దంగా ఉండాలి.. స్మార్ట్ క్షిపణులు రాబోతున్నాయి
అనంతరం, అయితే సిద్ధంగా ఉండండి రష్యా.. ఎందుకంటే త్వరలో సరికొత్త, స్మార్ట్ క్షిపణులు సిరియాకు రాబోతున్నాయి... విషవాయువుతో అమాయక ప్రజలను చంపి ఆనందించే జంతువులతో భాగస్వాములుగా ఉండటం ఎంతమాత్రం సరికాదని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆయుధాల రేసును ఆపాలన్న ట్రంప్కు రష్యా ఫారెన్ మినిస్ట్రీ చురకలు అంటించింది. అమెరికా స్మార్ట్ మిసైల్స్ టెర్రరిస్టులను టార్గెట్ చేయాలని, చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని కాదని సూచించింది.
రసాయన దాడి
సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డౌమా పట్టణంలో గత శనివారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. నాడీ మండలంపై ప్రభావం చూపించే విషపూరిత రసాయనం సారిన్ ఉన్న పీపా బాంబును హెలికాప్టర్లోంచి ప్రభుత్వ బలగాలు జారవిడిచాయని విపక్ష అనుకూల మీడియా కేంద్రం ఆరోపించింది. అయితే ఆరోపణలను సిరియా ఖండించింది.
చర్చలు విఫలం ప్రభుత్వం దాడులు
తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఘౌతాలో పలు ప్రాంతాలను రష్యా బలగాల సహకారంతో సిరియా ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. చివరిగా మిగిలిన డౌమా పట్టణాన్ని కూడా సిరియా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. రష్యా, తిరుగుబాటుదారుల మధ్య చర్చలు విఫలం కావడంతో అక్కడి ప్రభుత్వం దాడులకు దిగింది.