ఎంహెచ్ 17: రష్యా చానల్కు మహిళా యాంకర్ రిజైన్
లండన్: మలేషియా విమానం కూల్చివేత ఘటనపై రష్యా టుడే ఛానల్ ప్రసారాల తీరుకు నిరసనగా ఆ చానల్కు లండన్లో ప్రతినిధిగా ఉన్న మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రష్యా టుడేలో కథనం చూస్తుంటే... కడుపు మీద కొట్టినట్లుగా ఉందని, అందుకే రాజీనామా చేస్తున్నానని ట్వీట్ చేశారు.
కాగా, ఉక్రెయిన్లో మలేసియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం కూలిపోయిన సంఘటనపై నిష్పాక్షికమైన అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాల నేతలకు ఫోన్లు చేసారు. ఈ విమానాన్ని కూల్చివేసింది రష్యా అనుకూల తిరుగుబాటుదారులేనని విమర్శించిన కొద్ది గంటలకే ఆయన బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కామరాన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్లకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ ప్రమాదంపై నిష్పాక్షికమైన, పూర్తిస్థాయి పారదర్శకతతో కూడిన అంతర్జాతీయ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని వారంతా అంగీకరించారని వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎలాంటి జాప్యం లేకుండా ఒక సమగ్రమైన, అర్థవంతమైన దర్యాప్తును కొనసాగించడానికి వీలుగా అంతర్జాతీయ దర్యాప్తు అధికారులకు పూర్తిస్థాయి భద్రత ఉండేలా చూడడంతో పాటు, సంఘటన స్థలంలోకి స్వేచ్ఛగా వెళ్లగలిగేలా చూడాల్సిన బాధ్యత ఈ సంఘటనతో సంబంధం ఉన్న అన్ని పక్షాలపైనా ఉందని వారంతా స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.
సాక్ష్యాధారాలన్నీ కూడా చెక్కుచెదరకుండా ఉండాల్సిన అవసరం ఉందని వారంతా అంగీకరించినట్లు వైట్హౌస్ తెలిపింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ సైతం ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో, పోలండ్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్లకు ఫోన్ చేసి చర్చించారు.