రష్యా దాడులు: స్కూల్ పిల్లలు దుర్మరణం
బీరూట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్)పై రష్యా వైమానిక దాడులు చేస్తున్నది. రష్యా సైన్యం గురి తప్పి వైమానిక దాడులు జరపడంతో ఓ పాఠశాల నేలమట్టం అయ్యింది. పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు, అక్కడ పని చేస్తున్న టీచర్లు దుర్మరణం చెందారు.
ఇస్లామిక్ స్టేట్ అరాచకాలు పెరిగిపోవడంతో వారి అంతు చూడటానికి రష్యా గత కొంత కాలం నుంచి వైమానిక దాడులు చేస్తున్నది. సోమవారం సిరియా సమీపంలోని అంజారా పట్టణంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని అనుమానించారు.
వెంటనే ఆ ప్రాంతంలో వైమానిక దాడులు చేశారు. అయితే గురి తప్పి పాఠశాల భవనంపై బాంబులుపడ్డాయి. ఈ దాడిలో 12 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.
విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించారు. తమ లక్షం ఉగ్రవాదులని, సామాన్య పౌరులు కాదని, పొరపాటున ఇలా జరిగిందని రష్యా సంజాయిషీ ఇచ్చింది. అయితే రష్యా తీరుపై మానవహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.