కరోనా దెబ్బకు మరో దేశాధ్యక్షుడు.. ఐసోలేషన్లో పుతిన్..డాక్టర్ ద్వారా
''ప్రపంచంలో కరోనా ఫ్రీ దేశాలు రెండే. మొదటిది ఉత్తర కొరియా, రెండోది రష్యా'' అంటూ ఘనంగా చేసుకున్న ప్రచారం తుస్సుమంది. వైరస్ జాడే లేదన్న పరిస్థితి నుంచి ఇప్పుడేకంగా ధ్యక్షుడే ఐసోలేషన్ కు పరిమితం కావాల్సిన పరిస్థితి రష్యాలో నెలకొంది. ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నుంచి కేవలం వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే పరిపాలన సాగిస్తారని, ఎవర్నీ కలవబోరని అధికార కేంద్రం క్రెమ్లిన్ మీడియా ప్రకటన విడుదల చేసింది. ఇందుకుగల కారణాల్లోకి వెళితే..
కాస్త ఆలస్యంగానైనా రష్యాలో వైరస్ గట్టిగానే వ్యాప్తి చెందింది. దీంతో ప్రభుత్వం ఎక్కడిక్కడ నివారణ చర్యలు, ఆస్పత్రుల ఏర్పాట్లు చేపట్టింది. రాజధాని మాస్కోలో కొన్ని ఆస్పత్రుల్ని ప్రత్యేకంగా కరోనా ఆస్పత్రులుగా మార్చేసింది. వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షించేందుకు ప్రసిడెంట్ పుతిన్.. ఈనెల 24న మాస్కోలోని నాలుగో కరోనా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బాధ్యుల్లో ఒకరైన డాక్టర్ డెనిస్ ప్రొసెంకోతో కలిసి ఆస్పత్రి మొత్తం కలియదిరిగారు. సీన్ కట్ చేస్తే..
డాక్టర్ డెనిస్ కరోనా పాజిటివ్ గా తేలారు. రెండ్రోజుల కిందట లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా, వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వెంటనే ఆ విషయాన్ని అధికారులకు చెప్పడంతో అందరూ షాకయ్యారు. హుటాహుటిన ప్రెసిడెంట్ పుతిన్ కు కూడా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికి ఆయన బాగున్నారని, ఐసోలేషన్ లో ఉంటూనే పాలన కొనసాగిస్తున్నారని అధికారులు చెప్పారు.
బుధవారం రాత్రి నాటికి రష్యాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,777కు చేరగా, ఇప్పటిదాకా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ అక్కడ క్రిటికల్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చైనాలో వైరస్ వ్యాప్తి మొదలైన వెంటనే రష్యా మేల్కొని జాగ్రత్తలు తీసుకోవడంతో పెనువిపత్తునుంచి తప్పించుకున్నట్లయింది. అయితే ఇప్పుడు వైరస్ ప్రపంచమంతా విస్తరించడంతో ప్రయాణాల కారణంగా రష్యాలోకి కూడా చొరబడింది.