రష్యా అమెరికాల మధ్య నలిగిన భారత్: ఒప్పందంపై వాషింగ్టన్ పోస్టు విశ్లేషణ
భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన సందర్భంగా ఇండియా నాలుగు ఎస్ 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే రష్యాతో ఒప్పందం కుదుర్చుకోరాదంటూ అమెరికా భారత్పై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ భారత్ అమెరికా ఆంక్షలను పక్కకు పెట్టి రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే భారత్పై అమెరికా చర్యలు తీసుకుంటుందా..? దక్షిణాసియాలో ఈ ఒప్పందం కీలక మలుపుగా చూస్తున్న అమెరికా ఎలా వ్యవహరిస్తుంది..? దీనిపై పలు అమెరికా పత్రికలు రకరకాలుగా విశ్లేషిస్తూ కథనాలు ప్రచురించాయి.
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆగ్రహంతో ఉన్న అగ్రరాజ్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోవడంతో అగ్రరాజ్యం ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే రష్యాపై చర్యలు తీసుకునేందుకు సమయం కోసం వేచి చూసిందంటూ అమెరికా ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఇందులో భాగంగానే రష్యాతో అమెరికా మిత్రదేశం సత్సంబంధాలు నెరిపితే ఆ దేశాలపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అయితే ఈ చట్రంలో భారత్ ఇరుక్కుంది. భారత్ అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశం. అదే సమయంలో రష్యా నుంచి ఎప్పటి నుంచో ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ ఆయుధాలు కొనుగోలు చేయకుండా చేసి రష్యాకు షాక్ ఇవ్వాలన్న నెపంతో భారత్ పై ఆంక్షలు విధించింది. కానీ భారత్ ఆంక్షలను చెవిపెడిన పెడుతూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అమెరికా దిగొచ్చి రష్యా తమ శతృదేశం కాబట్టి రష్యానే తమ లక్ష్యం అని భారత్ కాదని వ్యూహాత్మక వాణి వినిపించింది అమెరికా.
రష్యా నుంచి ఎస్- 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు మోడీ పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందం
ట్రంప్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి
అమెరికా శతృదేశాలతో ఆ దేశం మిత్రదేశాలు సత్సంబంధాలు నెరిపితే అలాంటి దేశాలపై ఆంక్షలు విధించేందుకు క్యాట్సా చట్టాన్ని సైతం అమెరికా తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మాస్కోతో వాణిజ్య సంబంధాలు నెరిపిన దేశాలపై ఆంక్షలు విధించడమే. ఇందులో భాగంగా మాస్కోతో రక్షణ ఒప్పందాలు కానీ , ఇంటెలిజెన్స్ రంగంలోకానీ వాణిజ్యం నడిపితే ఆదేశాలపై ఆంక్షలు విధించడమే క్యాట్సా చట్టం లక్ష్యం. ఇప్పటి వరకు బాగానే ఉన్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన ఆంక్షలను తొలగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గత నెల సెప్టెంబర్లో చైనా రష్యానుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంతో డ్రాగన్ కంట్రీపై అమెరికా ఆంక్షలు విధించిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ గుర్తు చేసింది.
అత్తమీద కోపం దుత్త మీద చూపడమేంటి..?
చైనా ఉమ్మడి శతృవుగా మారడంతో అమెరికా భారత్ల మధ్య బంధం మరింత బలపడిందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది. అయితే రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. అదే సమయంలో భారత్ను వదులుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే అమెరికా ఏమి చేయాలో తెలియక తెలివైన సమాధానంతో బయటకు వచ్చింది. రష్యా తమ ప్రత్యర్థి అని చెబుతూ భారత్ను తాము వదులుకోలేమని చెప్పింది. రష్యా అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందున ఆ దేశంతో ఎవరూ ఆయుధాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోరాదంటూ ఆంక్షలు విధించడం అమెరికా వైపు నుంచి సరైనదే అనిపిస్తున్నప్పటికీ... ఏదైనా అది రష్యాతో తేల్చుకోవాలి కానీ... రష్యా మీద కోపం మరో దేశం మీద ప్రదర్శించకూడదని పలువురు అభిప్రాయపడుతున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
ఎవరితో స్నేహం చేయాలనేదానిపై స్వేచ్ఛ కావాలి
ఇదిలా ఉంటే అమెరికాతో సత్సంబంధాలు భారత్ బలంగా కోరుకుంటోందని అదే సమయంలో ఎప్పటి నుంచో రక్షణ రంగంలో రష్యాతో ఉన్న సంబంధాలను వదులుకోబోమని తెలిపింది. అంతేకాదు భారత్ ఏదేశాలతో స్నేహం చేయాలో... ఏదేశాలను పక్కన పెట్టాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కోరుకుంటోందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. చైనా ఇరాన్లతో అమెరికాకు శతృత్వం ఉండొచ్చు గాకా... వారితో శతృత్వం ఉంటే రెండు దేశాలు చూసుకోవాలిగానీ.. మరొకరిపై రుద్దడం భావ్యం కాదని భారత్ భావిస్తున్నట్లు అమెరికా వార్తా పత్రికలు కథనాన్ని ప్రచురించాయి.