అదే నిజమైన నివాళి: వాజపేయి మృతి పాక్ సహా ప్రపంచ నేతలు ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మరణంపై ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్ను ఓ స్థాయికి చేర్చారు.
Recommended Video
వాజపేయి మృతిపై ప్రపంచ దేశాధినేతలు తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్, అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్ సహా సార్క్ దేశాధినేతలు సంతాపం తెలిపారు.
భారత్, అమెరికా సంబంధాలు మెరుగుపరచడంలో వాజపేయి కీలక పాత్ర పోషించారని అమెరికా గుర్తుచేసింది. ఇరుదేశాల మధ్య సహజసిద్ధ సంబంధాలు ఉన్నాయని వాజపేయి అనేవారని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
భారత రాజకీయాల్లో వాజపేయి పేరు ఓ అంతర్భాగమైందని.. ప్రపంచం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని భారత్లో రష్యా రాయబారి విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్కు అటల్ మంచి మిత్రుడని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు.
శాంతి నెలకొల్పడమే ఆయనకు నివాళి అంటూ పాక్
పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ఖాన్ వాజపేయి మృతికి సంతాపం తెలిపారు. భారత్-పాకిస్థాన్ల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషిని ప్రారంభించిన వాజపేయి, ప్రధాని అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగించారని అన్నారు. భారత్, పాక్ల మధ్య శాంతి నెలకొల్పడమే వాజపేయి సాహెబ్కు ఇచ్చే నిజమైన నివాళి అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
వాజ్పేయీ, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు నిజాయితీగా శ్రమించారని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ నేత షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ గొప్ప నాయకుడిని కోల్పోయింది, కానీ ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు.
'అటల్ బిహారీ వాజ్పేయీ మరణించారని తెలిసి ఎంతగానో చింతిస్తున్నాం' అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ తెలిపారు. ఆయన గొప్ప నాయకుడు అని, భారత్-పాక్ సంబంధాల్లో ఎంతో మార్పు తెచ్చారని, సార్క్, రీజినల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్మెంట్ విషయాల్లో కీలక మద్దతుదారుగా నిలిచారని ఫైసల్ ప్రశంసించారు.