Sabarimala: అయ్యప్పస్వామి మకరజ్యోతి, చరిత్రలో మొదటిసారి, నిన్న లక్షల్లో భక్తులు, నేడు వేల మంది !
శబరిమల/ కొచ్చి/హైదరాబాద్: అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం ఇవ్వడానికి ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. శబరిమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్బంగా శబరిమల దర్శనం ఇస్తోంది. కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని ఆశపడతారు. అయితే కరోనా వైరస్ దెబ్బ కారణంగా ఈ సంవత్సరం సంక్రాంతి రోజు కేవలం 5 వేల మంది భక్తులు మాత్రమే శబరిమలలోని సన్నిధానంలోకి వెళ్లడానికి అవకాశం ఇవ్వడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.
Sabarimala: శబరిమల మకరవిలక్కు, తిరుణాభరణం ఊరేగింపు ప్రారంభం, సంక్రాంతికి సన్నిధానంలో !
అయ్యప్పకు ఇష్టమైన సంక్రాంతి
అయ్యప్పస్వామికి మకర సంక్రాంతి రోజు ఎంతో ఇష్టమైనది. తనకు ఇష్టమైన మకర సంక్రాంతి రోజు తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనం ఇస్తానని అయ్యప్పస్వామి చెప్పారని చరిత్ర చెబుతోంది. అయ్యప్పస్వామి మాల వేసిన ప్రతి భక్తులు ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా సంక్రాంతి రోజు శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని మకరజ్యోతిని చూసి జీవితం ధన్యం చేసుకోవాలని ఆశపడుతుంటారు.
కరోనా దెబ్బతో చాన్స్ మిస్
కరోనా వైరస్ మహమ్మారిని అడ్డం పెట్టుకుని శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులను సంఖ్యను తగ్గిస్తూ కేరళ ప్రభుత్వం అనేక కుంఠిసాకులు చెబుతూ వచ్చింది. శబరిమలకు ప్రతిరోజు 5 వేల మందిని అనుమతి ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను రద్దు చెయ్యాలని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అయ్యప్పస్వామి భక్తులు మండిపడుతున్నారు.
సంక్రాంతి రోజు అంతే మంది
మకరవిలక్కు ఉత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న మకర సంక్రాంతి రోజు కేవలం 5 వేల మంది అయ్యప్పస్వామి భక్తులు మాత్రమే శబరిమలలో ఉండానికి అధికారులు అవకాశం ఇచ్చారు. శబరిమలలో కేవలం ఐదు వేల మంది భక్తులు, అర్చకులు, అధికారులు మాత్రమే గురువారం ప్రత్యేక పూజలు చెయ్యడానికి అవకాశం ఇచ్చారు.
శబరిమల చరిత్రలోనే మొదటిసారి
మకరసంక్రాంతి పండుగ సందర్బంగా శబరిమలలో ప్రత్యేక పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు శబరిమలలో అయ్యప్పస్వామి మకర జ్యోతిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది భక్తులు వేచి ఉంటారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ పుణ్యమా అంటూ కేవలం 5 వేల మంది భక్తులు, అయ్యప్పస్వామి సన్నిధానం అర్చకులు, కొందరు అధికారులు, ఉద్యోగులు మాత్రమే శబరిమల సన్నిధానంలో ఉంటున్నారు.
టీవీల్లో మకరజ్యోతి దర్శనం ప్రత్యక్ష ప్రసారం
ఇప్పటికే ఊరిగింపుగా బయలుదేరిన తిరునాభరణం ఆభరణాలు గురువారం సాయంత్రానికి శబరిమల చేరుకుంటున్నాయి. శబరిమల ప్రత్యేక అధికారి అజిత్ కుమార్ మకరజ్యోతి దర్శనం సందర్బంగా అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గురువారం సాయంత్రం శబరిమల అయ్యప్పసన్నిధానం పశ్చిమ కనుమల్లో దర్శనం ఇస్తున్న మకరజ్యోతిని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. టీవీల్లో మకరజ్యోతిని చూడటానికి అయ్యప్పస్వామి భక్తులు, శివుడి భక్తులు భక్తిశ్రద్దలతో ఎదురు చూస్తున్నారు.