‘సల్మాన్ రష్దీని హత్య చేస్తే 6లక్షల డాలర్ల బహుమతి’
లండన్: ప్రముఖ బ్రిటీష్ రచయిత సల్మాన్ రష్దీ హత్యకు తాజాగా మరో ఫత్వా జారీ అయింది. ఈసారి ఇరాన్లోని 40ప్రభుత్వ మీడియా సంస్థలు చేతులు కలిపి ఈ ఫత్వాను జారీ చేశాయి. ఆయనను హత్య చేస్తే 6 లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ జారీ చేసిన ఫత్వా ప్రకారం.. బహుమతి 30 లక్షల డాలర్లకు ఇది అదనం అని పేర్కొన్నాయి. ఈ సొమ్మును సమకూర్చుతున్న మీడియా సంస్థల్లో ఫార్స్ న్యూస్ ఏజెన్సీ అతి పెద్దది. ఇది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్కు అనుబంధంగా పని చేస్తోంది. దాదాపు 30 వేల డాలర్లు విరాళంగా ఇచ్చింది.
కాగా, సల్మాన్ రష్దీ ‘సెటానిక్ వర్సెస్' అనే నవలను రాశారు. ఆ నవలలో ఇస్లాం చరిత్రను చర్చించారు. ఇది దైవ దూషణ అని ఇస్లాం మతస్థులు భావిస్తున్నారు.1989 ఫిబ్రవరి 15న మొదటిసారి అయతొల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేశారు.
ప్రపంచంలో ఉన్న ముస్లింలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ .. ‘సెటానిక్ వర్సెస్' నవల ఇస్లాంకు వ్యతిరేకమైనదని తెలిపారు. ఈ నవల ప్రచురణతో సంబంధం ఉన్నవారికి, ఆ నవలలోని విషయాలు తెలిసినవారికి మరణ శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని జపనీస్ భాషలోకి అనువదించిన హితోషీ ఇగారషిని హత్య చేశారు. కాగా, ఇటాలియన్ అనువాదకుడు, నార్వేజియన్ ప్రచురణకర్త హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు. ఫత్వా జారీ అయినప్పటి నుంచి చాలా కాలంగా సల్మాన్ రష్దీ రహస్య ప్రదేశంలో.. పోలీసు రక్షణ మధ్య ఉంటున్నారు.