రూల్స్ సడలింపు: ఆదేశంలో ఒకే గదిలో పురుషులు స్త్రీలు ఉండొచ్చు..కానీ అది కుదరదు
రియాద్: సౌదీ అరేబియాలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యవసనాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. అయితే కొన్ని నిబంధనలకు సడలింపునిస్తూ అక్కడికి వచ్చే టూరిస్టులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది సౌదీ ప్రభుత్వం. ఒక హోటల్ గదిలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఉండేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా జారీ చేసిన టూరిస్టు వీసా నిబంధనల్లో ఈ అంశాన్ని చేర్చింది.
ఇకపై ఒకే గదిలో పురుషులు స్త్రీలు ఉండొచ్చు
సౌదీ అరేబియాకు పర్యాటకులు వెళ్లినప్పుడు ఒక హోటల్లో గదిని బుక్ చేసుకుంటారు. ఇదివరకు టూరిస్టులు గదిలో ఉండాలంటే ఎన్నో నిబంధనలు ఉండేవి. పురుషులు మహిళలు ఒకే గదిలో ఉండనిచ్చేందుకు అక్కడి నిబంధనలు అనుమతించేవి కావు. కానీ కొత్తగా వీసా నిబంధనలు సడలించి విదేశీ పర్యాటకులు ఒకే గదిలో ఉండేందుకు అనుమతించింది. అంటే ఒకే గదిలో పురుషులు మహిళలు ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినప్పటికీ ఉండేందుకు సౌదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది సౌదీ అరేబియా మహిళలకు కూడా వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొంది.
వివాహం కాకుండా శృంగారంలో పాల్గొనరాదు
కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసేందుకు మార్గం సులభతరం అయ్యింది. అంతేకాదు వివాహం కానీ విదేశీయులు కూడా ఈ గల్ఫ్ దేశంలో ఉండేందుకు వెసులుబాటు కల్పించింది.అయితే ఇక్కడ ఒక షరతు విధించింది. వివాహం కాకుండా మరో మహిళ పురుషుడితో కానీ లేక మరో పురుషుడు మహిళతో కానీ శృంగారంలో పాల్గొనడంపై నిషేధం విధించింది.
పర్యాటక రంగంను అభివృద్ధి చేసేందుకే..
పర్యాటకులను ఆకర్షించి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు సౌదీ ప్రభుత్వం ఈ అడుగువేసినట్లు తెలుస్తోంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సౌదీ సర్కార్ భావించిన నేపథ్యంలో చాలా వరకు కఠిన నిబంధనలను తొలగిస్తోంది. అంతేకాదు మహిళలు తప్పనిసరిగా బుర్ఖాలు ధరించాల్సిన పనిలేదని చెబుతూ... కురచ దుస్తులను వేసుకోరాదని పేర్కొంది. ఇక మద్యంను కూడా నిషేధించింది. కొన్ని దశాబ్దాలుగా సౌదీఅరేబియాలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అయితే గత కొద్ది కాలంగా ఈ నిబంధనలకు స్వస్తి పలుకుతోంది అక్కడి సర్కార్.
మొహ్మద్ బిన్ సల్మాన్ రాకతో మారుతున్న సౌదీ నిబంధనలు
మహిళలు వాహనాలు నడపరాదన్న నిబంధనకు గతేడాది ఫుల్ స్టాప్ పెట్టింది సౌదీ ప్రభుత్వం. అంతేకాదు మహిళలు విదేశాలకు వెళ్లకూడదనే నిబంధనలకు కూడా సర్కార్ బ్రేకులు వేసింది. మహిళ విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా మగతోడు ఉండాలనే నిబంధన ఉండేది. దాన్ని ప్రభుత్వం తొలగించింది. ఇవన్నీ సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పులు కావడం విశేషం. ఆయన తీసుకున్న నిర్ణయాలను అంతర్జాతీయ సమాజం సైతం అభినందించింది. అయితే జర్నలిస్టు జమాల్ కషోగ్గి హత్యతో అమాంతం పెరిగిన సల్మాన్ ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది.