గుర్తింపు: ఇప్పుడు సౌదీలో యోగా అధికారికమే
రియాద్: యోగాను ఓ క్రీడా కార్యకలాపంగా గుర్తించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఈ మేరకు సౌదీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ.. సౌదీ పౌరులను యోగా చేసుకునేందుకు అనుమతిచ్చినట్లు స్పష్టం చేసింది. మంగళవారం దీనిపై అధికారిక ప్రకటన చేసింది.
కాగా, 37ఏళ్ల యోగా కోచ్ నౌఫ్ మర్వాయి చేసిన పోరాటం సౌదీ ప్రకటనతో విజయవంతమైందని చెప్పవచ్చు. సౌదీ ప్రభుత్వ తాజా ప్రకటనతో దేశంలో ఎవరైనా యోగాను ప్రాక్టీస్ చేయవచ్చు.
ఇప్పటికే వేలాది మందికి నౌఫ్.. యోగా పాఠాలను నేర్పుతోంది. ఈ నేపథ్యంలోనే 2005 నుంచి ఆమె యోగా అంశంపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ వస్తోంది. చివరకు ఆమె సౌదీ రాజకుమారిని కలిసి తన ప్రయత్నాన్ని వివరించింది. దీంతో క్రీడా కార్యకలాపంగా యోగాను మార్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక, క్రీడల్లో మహిళలు కూడా పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజున ప్రపంచ దేశాల్లోని ప్రతినిధులతోపాటు ప్రముఖులు, సామాన్యులు కూడా యోగాను ఆచరిస్తున్నారు.