సౌదీ వర్సెస్ హౌతీ: అతిపెద్ద చమురు కేంద్రంపై క్షిపణి దాడులు నిజమే: సౌదీ ప్రభుత్వం
సౌదీ అరేబియా: రాస్ తనూరా పోర్టులోని ఓ పెట్రోల్ ట్యాంకును డ్రోన్లతో కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తనూరా పోర్టు ప్రంపంచలోనే అతిపెద్ద చమురు రవాణా పోర్టుగా గుర్తింపు ఉంది. డ్రోన్ ద్వారా విడుదలైన క్షిపణి సౌదీ అరాంకోలోని దహ్రాన్లో ఉన్న నివాస ప్రాంతాలకు సమీపంలో పడినట్లు సౌదీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ క్షిపణి దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తినష్టం కానీ జరగలేదని మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అంతకుముందు అరాంకో చమురు కేంద్రంపై దాడి తమపనే అని యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించారు. అయితే అరాంకో ప్రాంతంలో చమురు కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని దాడి చేయడం ఇదే తొలిసారి. రాస్ తనూరా పోర్టుకు సమీపంలో ఉన్న చమురు కేంద్రాలను క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడి చేసినట్లు ఓ టీవీ ఛానెల్లో ప్రకటన విడదుల చేసింది యెమెన్ హౌతీ రెబల్ సంస్థ. 2015 నుంచి ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న యెమెన్ హౌతీ రెబెల్ సంస్థ గతంలో కూడా రెండు సార్లు దాడులు నిర్వహించగా సౌదీ చాకచక్యంగా ఆదాడులను తిప్పికొట్టిందని సౌదీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ సమయంలో డ్రోన్లను తమ బలగాలు కూల్చివేశాయని గుర్తు చేసింది.
ఇక ఆదివారం రోజున సౌదీపై హౌతీలు పలుమార్లు డ్రోన్లతో దాడులు నిర్వహించారు. పౌరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా 10 డ్రోన్లతో దాడులు నిర్వహించగా కొన్నిటిని అడ్డుకున్నట్లు సౌదీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పౌరులు, పౌరులకు చెందిన ఆస్తులపై దాడులు చేస్తే సహించేది లేదని గట్టిగా ఆ రెబెల్స్కు బుద్ధి చెప్తామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. హౌతీల దాడుల కంటే ముందు యెమెన్ రెబెల్స్ రాజధానిగా ప్రకటించుకున్న సానా ప్రాంతంపై సౌదీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అంతేకాదు దాడుల తర్వాత నగరం నుంచి దట్టమైన పొగలు వస్తున్న వీడియోను సైతం విడుదల చేసింది సౌదీ ప్రభుత్వం. అయితే ముందుగా తాము చేసిన దాడులకు ప్రతీకారచర్యల్లో భాగంగానే అరాంకోపై హౌతీలు దాడి చేసినట్లు సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియాపై హౌతీల దాడులు ఎక్కువయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హౌతీలను ఉగ్రవాద సంస్థ కింద చేర్చారు. అయితే జో బైడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే హౌతీలను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించారు. హౌతీలను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించడంతోనే వారి ఆగడాలకు అదుపు లేకుండా పోతోందని సౌదీ అరేబియా చెబుతోంది. అందుకే యెమెన్ మరియు సౌదీ అరేబియాలో పౌరులనే లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణి, మరియు డ్రోన్ల దాడులకు తెగబడుతున్నట్లు సౌదీ ఆగ్రహం వ్యక్తం చేసింది.