సౌదీలో భారీ సంస్కరణలు: ఇకపై కొరడా శిక్ష ఉండబోదు..తప్పు చేస్తే ఏం చేస్తారో తెలుసా..?
సౌదీ అరేబియాలో కొత్త సంస్కరణలు ఊపిరిపోసుకుంటున్నాయి. మారిన రాజుతో పాటుగా ఆ దేశం తీసుకొస్తున్న సంస్కరణలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఆదేశ రాజు సల్మాన్ ప్రకటించిన సంస్కరణలు కూడా ప్రశంసించతగ్గవే కావడం విశేషం. ఇలాంటి వాటిలో ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని రాజు ప్రకటించడం అభినందనీయమని పలువురు చెబుతున్నారు.
ఇక తాజాగా గల్ఫ్ దేశం యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇది కూడా సంస్కరణల్లో భాగమే అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ పట్టుబడితే వారికి కొరడాతో దెబ్బలు పడేవి. అయితే కొరడా శిక్షకు బదులుగా జైలు శిక్ష లేదా జరిమానా విధించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజు సల్మాన్ తీసుకొచ్చి మానవహక్కుల సంస్కరణలో భాగమని అభివర్ణించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వారిని జైలులో పెట్టడం, జర్నలిస్టు జమాల్ ఖషోగ్గిని సౌదీ ప్రభుత్వమే హత్య చేయించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు వెంటనే అమల్లోకి రావాలంటూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంతకుముందు తప్పు చేసిన వారికి కొరడా శిక్ష అమలు చేయగా దీన్ని ప్రపంచ మానవహక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు తప్పుబట్టింది. ఒక మనిషిని హింసించే హక్కు లేదంటూ పేర్కొంది. మానవహక్కుల వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సౌదీ సర్కార్ కొత్త సంస్కరణలను అమలు చేయనుంది. మానవ హక్కుల సమస్యపై సౌదీ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్య ఇది అని సౌదీ అరేబియా మానవ హక్కుల కమిషన్ చీఫ్ అవధ్ అలవాడ్ అన్నారు.
ఇక కొన్ని విషయాల్లో రాజు సల్మాన్ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారందరినీ విడుదల చేయాలని సల్మాన్ రాజు ఆదేశించారు. వారి కేసులలో కోర్టు ఆదేశాలు తీసుకోకూడదని రాజు సలహా ఇచ్చారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటించే ఉత్తర్వులతో మలయాళీలతో సహా చాలా మందికి పెద్ద ఉపశమనం లభించింది. బెయిల్ పొందిన వారికి ఉపశమనం కల్పించాలంటూ రాజు ఆదేశాలు జారీ చేశారు.