ఎవరైనా ఒకటే: సౌదీ యువరాజుకు మరణశిక్ష అమలు
రియాద్: సౌదీ అరేబియాలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రపంచానికి తెలిసిన విషయమే. నేరాలు ఎంత తీవ్రంగా ఉంటాయో.. నిందితులకు వేసే శిక్షలు కూడా అంతే తీవ్రతను కలిగి ఉంటాయి. అంతేగాక, ఇక్కడ స్థాయిని బట్టి శిక్షలు ఉండవు. నేరాన్ని బట్టి మాత్రమే శిక్షలు అమలవుతుంటాయి. తాజాగా ఏకంగా యువరాజుకే మరణ శిక్ష విధించిన సౌదీ దీన్ని రుజువు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 2012లో రియాద్ శివారులోని ఓ క్యాంప్లో జరిగిన ఘర్షణలో అదెల్ అల్ మహెమిద్ అనే వ్యక్తిని సౌదీ రాకుమారుడు టుర్కీ బిన్ సౌద్ అల్-కబీర్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో కబీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అదెల్ను కబీర్ హత్య చేసినట్లు 2014లో రియాద్ కోర్టు నిర్ధారించి మరణశిక్ష విధించింది. దీంతో బుధవారం అతడికి శిక్ష అమలుచేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే సౌదీ చట్టాల ప్రకారం.. హత్య, మాదకద్రవ్యాల రవాణా, దొంగతనం, అత్యాచారం లాంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.
ఆయా కేసుల్లో నిందితులకు మరణశిక్ష విధిస్తారు. వీరిలో చాలా మందికి శిరచ్ఛేదనం ద్వారా మరణశిక్ష అమలు చేస్తారు. నిరుడు 158మందికి మరణశిక్ష అమలుచేయగా.. ఈ ఏడాదిలో కబీర్తో కలిపి 134 మందిని మరణశిక్ష విధించారు. వీరిలో ఒక్క జనవరి నెలలోనే ఉగ్రవాదం ఆరోపణల కింద 47మందికి మరణశిక్ష అమలు చేయడం గమనార్హం.