మర్యాదగా వెళ్లిపోండి: ఇరాన్ కు సౌదీ వార్నింగ్
రియాద్: సౌదీ అరేబియా సంచలనమైన నిర్ణయం తీసుకునింది. ఇరాన్ తో సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు తెంచుకునింది. 48 గంటల్లో సౌదీ అరేబియాలోని ఇరాన్ దౌత్య అధికారులు దేశం విడిచి వెళ్లిపోవాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇరాన్ లోని తమ దౌత్య కార్యాలయంపై దాడి జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలో షియా మత పెద్ద నిమ్ర్ అల్ నిమ్ర్ ను శనివారం ఉరి తీసిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై ఇరాన్ లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం ఇరాన్ లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో, రాళ్లతో దాడులు చేశారు. ఈ విషయంపై సౌదీ అరేబియా ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఈ దాడి గురించి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ -అల్- జుబేర్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేశారు. ఇరాన్ లోని తమ దౌత్య వేత్తలు సురక్షితంగా సౌదీ అరేబియా చేరుకున్నారని వెల్లడించారు.
తమ దౌత్య కార్యాలయంపై దాడులు జరుగుతున్నా వాటిని అడ్డుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆల్ ఖైదాకు అయుధాలు సరఫరా చేస్తూ వారికి అండగా ఇరాన్ ప్రభుత్వం ఉందని అన్నారు.
షియా మత గురువు నిమ్ర్ అల్ నిమ్ర్ కు మరణ శిక్ష అమలు చెయ్యడాన్ని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఖండించారు. నిమ్ర్ అల్ నిమ్ర్ విషయంలో సౌదీ అరేబియా అమానుషంగా ప్రవర్తించిందని వ్యాఖ్యానించారు.
అయితే ఇరాన్ లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంపై దాడి చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద సౌదీ అరేబియా-ఇరాన్ దౌత్య సంబంధాలకు బ్రేక్ పడింది.