డ్రోన్ దాడుల ఎఫెక్ట్: సౌదీలో సగానిపైగా నిలిచిన చమురు ఉత్పత్తి
రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. భారీగా చమురు శుద్ధి ప్రక్రియ నిలిచిపోయిందని కంపెనీ చీఫ్ అమిన్ నాసర్ వెల్లడించారు.
దాదాపు సగానికిపైగా 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఆగిపోయిందని తెలిపారు. ప్రపంచ చమురు ఎగుమతుల్లో ఇది ఆరు శాతం కావడం గమనార్హం. దీని ప్రభావం చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోజువారీ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ చీఫ్ తెలిపారు.
తూర్పు సౌదీ అరేబియాలోని అరాంకోకు చెందిన అబ్కైక్, ఖురైన్ చమురు క్షేత్రాలపై ఇరాన్తో సంబంధాలున్న హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్-సౌదీ అరేబియాల మధ్య విభేదాలే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే, సౌదీ అరేబియాపై యెమనీ తిరుగుబాటుదారులు మరిన్ని దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజుతో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అవసరమైన సాయాన్ని అందిస్తామని తెలిపారు.