గాలిలో విమానం: పైలట్కి గుండెపోటు, మృతి
రియాద్: మరో విమాన పెను పరప్రమాదం తృటిలో తప్పింది. 220 మంది ప్రయాణికులతో ఓ విమానం 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగాఆ విమాన పైలట్కు గుండెపోటు వచ్చింది. కొద్ది క్షణాల్లోనే ఆయన ప్రాణాలు విడువగా.. వెంటనే అప్రమత్తమైన కో పైలట్ సురక్షితంగా విమానాన్ని కిందికి దించి 220మంది ప్రాణాలను కాపాడాడు.
సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన ఎస్వీ 1734 విమానంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 220 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది.
అయితే, రెండు గంటలపాటు సాఫీగా సాగిన గగనయానంలో.. మరికాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందనగా కెప్టెన్ పైలట్ వలీద్ బిన్ మహమ్మద్ ఆల్ మహమ్మద్కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కాక్పీట్లోకి వెళ్లిపోగా.. సహ పైలట్ సలె బిన్ నాజర్ ఆల్ జసర్.. అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించాడు.
గగనయానంలో ఉన్న విమానాన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు. అంతేకాకుండా విమానాశ్రయ అధికారులకు పైలట్కు గుండెపోటు వచ్చిన వార్త తెలియజేసి.. ల్యాండ్ అయిన వెంటనే అంబులెన్సు, వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా ఏర్పాటుచేశాడు.
అయితే, విమానం ల్యాండ్ అయ్యేసరికే ప్రధాన పైలట్ గుండెపోటుతో చనిపోయాడు. కో పైలట్ సంక్షోభ పరిస్థితుల్లో గుండెనిబ్బరంతో వ్యవహరించి.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారని, అపాయంలో ఉన్నట్టు కూడా వారికి తెలియలేదని సౌదీ ఎయిర్లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. చనిపోయిన పైలట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.