జర్నలిస్ట్ జోలికి వెళ్లినందుకు: అయిదుమందికి మరణ శిక్ష..ముగ్గురికి 24 సంవత్సరాల జైలు: సంచలన తీర్పు..
రియాద్: ఓ జర్నలిస్టు జోలికి వెళ్లినందుకు అయిదుమందికి మరణ శిక్ష పడింది. మరో ముగ్గురు 24 సంవత్సరాల పాటు కారాగార శిక్షకు గురయ్యారు. ఆ జర్నలిస్టు- జమాల్ ఖషోగ్గి. సౌదీ అరేబియాకు చెందిన టాప్ జర్నలిస్ట్. గత ఏడాది అక్టోబర్ లో టర్కీలోని ఇస్తాంబుల్ దారుణ హత్యకు గురయ్యారు. ఖషోగ్గి హత్యకేసులో మొత్తం ఎనిమిది మందికి సౌదీ అరేబియా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం సంచలన తీర్పును వెలువడించింది.
జర్నలిస్టు ఖషోగ్గి హత్యలో సంచలన కథనం...చంపిన తర్వాత సౌదీ ఈ దారుణానికి పాల్పడిందా..?
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఖషోగ్గి హత్య..
జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి.. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఇస్తాంబుల్ లోని సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయంలో చివరిసారిగా కనిపించారు. అక్కడే ఆయన హత్యకు గురయ్యారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఖషోగ్గి.. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు క్రిటిక్ గా గుర్తింపు పొందారు. తన వివాహ పత్రాలకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడానికి ఆయన సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో- ఈ ఘటన చోటు చేసుకుంది.
సౌదీ అరేబియా ఏజెంట్లేనంటూ..
సౌదీ అరేబియా ఏజెంట్లు ఖషోగ్గిని హత్య చేసి ఉంటారంటూ అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఖషోగ్గి దారుణహత్యకు గురి కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపు అన్ని దేశాలు కూడా ఖషోగ్గి హత్యోదంతం పట్ల స్పందించాయి. ఈ కేసులో మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎనిమిది మందికి శిక్షను ఖరారు చేసినట్లు సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
రాజ కుటుంబ సలహదారుపైనా అనుమానాలు.. కేసు కొట్టివేత
ఇదే కేసులో- సౌదీ అరేబియా రాజ కుటుంబీకుల సలహాదారు సవుద్-అల్-ఖ్వాతానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల పాటు విచారించారు. ఈ హత్య కేసులో ఆయన ప్రమేయం లేదని తేలినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ షలన్-అల్-షలాన్ వెల్లడించారు. ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న అయిదుమందికి మరణ శిక్షను విధించడంతో పాటు మరో ముగ్గురికి 24 సంవత్సరాల పాటు కారాగార శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.