సౌదీ రాజుకు పాకిస్తాన్ ఎలాంటి బహుమతి ఇచ్చిందో తెలుసా..?
సాధారణంగా విదేశీ అతిథులు ఆయాదేశాల పర్యటనలకు వస్తే కానుకలు, బహుమతులు, జ్ఞాపికలు ఇవ్వడం సహజంగానే కనిపిస్తుంది. ఎవరైనా అతిథులు హైదరాబాద్ పర్యటనకు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి చార్మినార్ జ్ఞాపికను అందజేస్తారు. అలానే అతిథులు ఆంధ్రప్రదేశ్కు వెళితే వీణ, లేదా వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తారు. ఇక దేశాధినేతలు ఇచ్చే కానుకలు బహుమతులు అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. భారత్లో పర్యటనకు ముందు సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్లో పర్యటించారు. ఆ సందర్భంగా పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు ఆయనకు ఎలాంటి బహుమానం ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు.
బంగారు తుపాకీ బహుమానం
తాను మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఉంది పొరుగుదేశం పాకిస్తాన్ వ్యవహారం. అసలే ఆర్థిక పరిస్థితులు బాగాలేక విదేశాల సహాయం కోరుతున్న పాకిస్తాన్.... తమ దేశంలో పర్యటించిన సౌదీరాజు మొహ్మద్ బిన్ సల్మాన్కు బంగారు పూత కలిగిన తుపాకీని బహుకరించింది. హెక్లర్ & కోచ్ ఎంపీ 5 తుపాకీకి బంగారు పూత పూయించి దాన్ని మొహ్మద్ బిన్ సల్మాన్కు కానుకగా ఇచ్చింది దాయాది దేశం. ఇక ఈ తుపాకీని జర్మనీకి చెందిన ఇంజినీర్లు తయారు చేశారు. దీంతో పాటుగా మహ్మద్ బిన్ సల్మాన్ ఫోటోను కూడా బహుమతిగా ఇచ్చారు.
మొహ్మద్ బిన్ సల్మాన్పై విమర్శలు
ఇప్పటికే సౌదీ జర్నలిస్టు జమాల్ కషోగి హత్యలో మొహ్మద్ బిన్ సల్మాన్ పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ తుపాకీ బహుకరించడం.. ఆయన స్వీకరించడంపై పలుదేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతేడాది అక్టోబర్లో ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సులేట్ వద్ద కషోగి హత్యగావించబడ్డారు. ఇదిలా ఉంటే అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం సల్మాన్ ఆదేశాలు లేనిదే ఈ హత్య జరిగి ఉండదన్న అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు సల్మాన్కు కషోగి హత్యకు ఎలాంటి సంబంధం లేదని పదే పదే చెప్పుకుంటూ వచ్చాయి సౌదీ ప్రభుత్వ వర్గాలు
పాక్లో సల్మాన్కు గన్ సెల్యూట్ స్వాగతం
ఆసియా దేశాల పర్యటనను పాకిస్తాన్తో మొదలు పెట్టారు సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్. ఈ సందర్భంగా సల్మాన్కు పాక్లో ఘనస్వాగతం లభించింది. 21 సార్లు గన్ సెల్యూట్తో పాటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లై పాస్ట్ చేసి స్వాగతం పలికింది. అంతేకాదు రాజు రాక సందర్భంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ విమానాశ్రయంను మూసివేశారు. అంతేకాదు అక్కడి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక పాక్ పర్యటన సందర్భంగా ఆదేశంతో సౌదీ అరేబియా 20బిలియన్ అమెరికా డాలర్లు మేరా ఒప్పందాలు కుదర్చుకుంది.