అమెరికా బాటలో సౌదీ: భారతీయుల ఉపాధిపై భారీ దెబ్బ
సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా అమెరికా బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశస్థులకే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా తమ వీసా విధానంలో నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా అమెరికా బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశస్థులకే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా తమ వీసా విధానంలో నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సౌదీ అరేబియా కూడా తమ దేశస్థులకు ఉద్యోగవకశాలు పెంచేందుకు సిద్ధమైంది.
తెలంగాణ వాసులకు సౌదీ 'పన్ను' పోటు: 18ఏళ్లు దాటితే ఎవరికైనా..
భారతీయులకు ఉపాధి కష్టమే..
ఈ క్రమంలోనే ఆ దేశంలో పాటించే నితాఖత్(సౌదీసేషన్) విధానంలో సవరణలు చేపట్టింది. విదేశీయుల కంటే సౌదీలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేలా ఈ సవరణలు చేసింది. సెప్టెంబర్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లే భారతీయులకు ఉద్యోగాలు దొరకడం కష్టతరం కానుంది.
సౌదీయులకే మేలు..
విదేశాల నుంచి వలసలు పెరిగిపోతుండటంతో స్వదేశీయులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు సౌదీ అరేబియా 2011లో నితాఖత్ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ప్రయివేటు సెక్టార్లలో విదేశీ ఉద్యోగులకు బదులుగా సౌదీ జాతీయులకు ఉద్యోగావకాశాలు పెంపొందించడం. ఈ విధానం కింద దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలను నాలుగు కేటగిరీలుగా చేసింది.
నిబంధనల మార్పుతో..
సంస్థలో పనిచేసే ఉద్యోగులు, చేసే వ్యాపారం, వచ్చే ఆదాయాన్ని, ఉద్యోగుల సగటు జీతం బట్టి ప్లాటినం, గ్రీన్, ఎల్లో, రెడ్ సంస్థలుగా విభజించింది. వీటిని బట్టి సంస్థల్లో సౌదీ, విదేశీ ఉద్యోగుల నిష్పత్తిని ప్రభుత్వం తయారుచేస్తుంది. ఉదాహరణకు ప్లాటినం సంస్థల్లో 40శాతం కంటే ఎక్కువగా సౌదీ జాతీయులే ఉద్యోగులుగా ఉండాలి. ఇప్పటివరకూ 10 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రయివేటు సంస్థలకు నితాఖత్ విధానాన్ని అమలు చేసేవారు. తాజాగా చేపట్టిన సవరణలో ఈ సంఖ్యను 6 లేదా అంతకంటే ఎక్కువకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వలసలు తగ్గే అవకాశం
అంతేగాక.. ప్లాటినం, హైగ్రీన్ సంస్థలు మాత్రమే బ్లాక్ వీసాల జారీకి అర్హులని నిర్ధారించింది. ప్లాటినమ్, హైగ్రీన్ కేటగిరీల్లో ఉండే సంస్థలు తక్కువగా ఉండటంతో భారత్ నుంచి వెళ్లే వారికి ఉద్యోగావకాశాలుతగ్గిపోనున్నాయి. ఇటీవల లోక్సభలో ఇచ్చిన నివేదిక ప్రకారం.. 2016లో భారత్ నుంచి 25లక్షల మంది సౌదీలో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంలో ఉన్నవారే. అంటే కూలీలు, మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి సౌదీకి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. తాజా నిబంధనతో భారతీయులకు సౌదీలో ఉపాధి లభించడం కష్టతరంగా మారనుంది. దీంతో ఇకపై ఉపాధి కోసం సౌదీకి వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.