భారత పర్యటనకు సౌదీ రాజు సల్మాన్... ఉగ్రవాదం అంశంను లేవనెత్తనున్న భారత్
పాకిస్తాన్లో తన పర్యటన ముగించుకుని భారత పర్యటనకు రానున్నారు సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్. ఈయన పర్యటన సందర్భంగా భారత్ పలు అంశాలను అతని దృష్టికి తీసుకురానుంది. ముఖ్యంగా ఐదురోజుల క్రితం భారత జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని సల్మాన్ దృష్టికి తీసుకురానుంది. దక్షిణాసియా దేశాల పర్యటన సందర్భంగా ఆదివారం ఇస్లామాబాదుకు వెళ్లిన యువరాజు సల్మాన్ అక్కడి నుంచి భారత్కు రావాల్సి ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన సోమవారం సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లారు. ఇక అక్కడి నుంచి నేరుగా భారత్కు మంగళవారం రానున్నారు.
పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య శాంతియుత వాతావరణం తీసుకొచ్చేందుకు సౌదీ అరేబియా చొరవతీసుకుంటుందని ఆ దేశ విదేశాంగా శాఖ మంత్రి అదిల్ అల్ జుబేర్ తెలిపారు. ఇదిలా ఉంటే కశ్మీర్పై పాక్ అల్లిన కట్టుకథలను సౌదీ అరేబియా విశ్వసించడం లేదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోడీతో యువరాజు సల్మాన్ భేటీ సందర్భంగా ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ ప్రస్తావనను భారత్ తీసుకువస్తుందని సమాచారం. మరోవైపు ఇరు దేశాలు ఐదు రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి త్రిమూర్తి తెలిపారు. పెట్టుబడులు, పర్యాటకం, గృహ నిర్మాణం, సమాచారం మరియు ప్రసార రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.
ఇక పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని సౌదీ అరేబియా ఖండించినట్లు భారత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14న జవాన్లపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిని సౌదీ అరేబియా ఖండించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలను సౌదీ అరేబియా నిశితంగా పరిశీలిస్తోందని పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంను సహించరానిదిగా సౌదీ అరేబియా పేర్కొందని భారత వర్గాలు తెలిపాయి. ఇక సౌదీ అరేబియాతో అత్యంత దగ్గర సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని చెప్పారు త్రిమూర్తి. ఇక సౌదీ యువరాజు పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామి సమాఖ్యను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆర్థిక కార్యదర్శి త్రిమూర్తి వెల్లడించారు.
ఇక సౌదీ రాజు పర్యటన సందర్భంగా బుధవారం హైదరాబాద్ హౌజ్లో ప్రధాని మోడీ విందును ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుస్తారు సౌదీ యువరాజు. 2016లో సౌదీలో ప్రధాని మోడీ పర్యటించినప్పుడు మనీలాండరింగ్కు సంబంధించి ఇరుదేశాలు సమాచార మార్పిడి చేసుకునేలా, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరులాంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతేకాదు సౌదీ అరేబియా భారత్కు ఆయిల్ సరఫరా కూడా చేస్తోంది.