ఆ దేశంలో ఉండొద్దు.. వచ్చేయండి: సౌదీ అత్యవసర ప్రకటన, అదే బాటలో కువైట్, బహ్రెయిన్
లెబనాన్లో ఉంటోన్న తమ పౌరులు వెంటనే ఆ దేశం విడిచి వచ్చేయాలంటూ సౌదీ ప్రభుత్వం ఓ అత్యవసర ప్రకటన చేసింది. సౌదీ బాటలోనే కువైట్ బహ్రెయిన్ కూడా తమ పౌరులను వచ్చేయమంటూ ఆదేశాలిచ్చాయి.
రియాధ్: లెబనాన్లో ఉంటోన్న తమ పౌరులు వెంటనే ఆ దేశం విడిచి వచ్చేయాలంటూ సౌదీ ప్రభుత్వం ఓ అత్యవసర ప్రకటన చేసింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఉపాధి, ఉద్యోగ రీత్యా సౌదీ పౌరులు ఎంతోమంది లెబనాన్ వెళ్లారు. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా సౌదీ పౌరులు అతిత్వరగా ఆ దేశం నుంచి వచ్చేయాలని అత్యవసర ప్రకటనలో సౌదీ సూచించింది.
అంతేకాదు, ప్రపంచ దేశాల్లోని తన పౌరులెవరూ కూడా రిపబ్లిక్ ఆఫ్ లెబనాన్ వెళ్లరాదని హెచ్చరించింది. మరోవైపు సౌదీ అరేబియా బాటలోనే కువైట్ ప్రభుత్వం కూడా తన పౌరులకు అత్యవసరాదేశాలిచ్చింది.
లెబనాన్ను విడిచిపెట్టి వచ్చేయాలని, ఎవరూ ఆ దేశానికి వెళ్లొద్దని కోరింది. లెబనాన్ దేశంలో పాలన ఇరాన్ నియంత్రణలో ఉందనీ ఇటీవల సౌదీలో రాజీనామాను ప్రకటించిన సూడాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరీరీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సౌదీ, కువైట్ కంటే ముందే.. ఆదివారం నాడే బహ్రెయిన్ తమ దేశ పౌరులను లెబనాన్ నుంచి వచ్చేయాలని కోరింది.