అనూహ్యం: 'ప్లాస్టిక్'ని తినే ఎంజైమ్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
లండన్: ప్రపంచ దేశాలన్నింటికీ 'కాలుష్యం' ఇప్పుడో పెనుముప్పు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. భూమిలో కరగని ఈ ప్లాస్టిక్ వల్ల జీవ విధ్వంసం జరుగుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు దీనికో పరిష్కారం కనుగొనడంలో శాస్త్రవేత్తలు విఫలమయ్యారు.
రీసైక్లింగ్ తప్పించి ప్లాస్టిక్ ను నియంత్రించే ప్రత్నామ్నాయం ఏది ఇంతవరకు లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్ శాస్త్రవేత్తలు అనూహ్యంగా ప్లాస్టిక్ ని తినే 'ఎంజైమ్' ఒకదాన్ని కనుగొన్నారు. ప్రపంచ కాలుష్య సమస్యకు ఇదో పరిష్కార మార్గమవుతుందని వారు భావిస్తున్నారు.
జీవ ఉత్ప్రేరకమైన ఈ ఎంజైమ్ జపాన్ బాక్టీరియా నుంచి ఉత్పత్తి అయినట్టుగా చెబుతున్నారు. జపాన్ రీసైక్లింగ్ సెంటర్ లో ప్రయోగాల ఫలితంగా.. క్రమంగా దీన్నిప్లాస్టిక్ ని తినే ఎంజైమ్ గా తయారుచేశారు. ప్రయోగాత్మకంగా పరిశోధకులు ఈ ఎంజైమ్ ని పరిశీలించి.. దీనికి ప్లాస్టిక్ ని తినే సామర్థ్యం ఉందని నిర్దారించారు.
'శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఊహించని పరిణామాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దానికి మా పరిశోధన కూడా మినహాయింపేమి కాదు' అని ప్రొఫెసర్ మెక్ గీహన్ తెలిపారు. నేషనల్ అకాడమీ సైన్సెస్ జర్నల్ దీన్ని ప్రచురించింది.