ఎయిర్ ఆసియా: బ్లాక్ బాక్స్ రికార్డుల కోసం మరో వారం
జకార్తా/ సింగపూర్: సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ రికార్డల కోసం మరో వారం రోజులు ఆగవలసిందేనని ఇండోనేషియా అధికారులు చెప్పారు. ఆ బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 8501 కూలిపోయిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవని అధికారులు తెలిపారు.
విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం ఐదో రోజు గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విమానంలో 162 మంది ఉండగా, ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు సాధ్యం కావడంలేదు. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బలమైన అలల వల్ల విమాన శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి.
కాగా, 162 మంది (155మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది)తో వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం విమాన శకలాలతో పాటు 40 మృతదేహాలను గుర్తించారు. ఈ విషయాన్ని ఇండోనేషియా నౌకాదళం అధికారులు ప్రకటించారు. ఇండోనేషియా బోర్నియా ద్వీపం సమీపంలో జావా సముద్రంలో విమానం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు గుర్తించినట్లు ఏవియేషన్ సంస్థ తెలిపింది.
విమాన శకలాలు ఉన్న చోట 40 మృతదేహాలు గుర్తించామని చెప్పారు. ఆ మృతదేహాలను వెలికి తీశారు. వాటిని ప్రత్యేక నౌకల ద్వారా తీరానికి చేర్చినట్లు చెప్పారు. మృతదేహాలు లభించిన బోర్నియా సమీపంలోనే విమానం కూలిపోయి ఉండవచ్చునని చెబుతున్నారు. కూలిపోయే సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నందునే మృతదేహాలు సముద్ర పైభాగంలోకి వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.