ఎంహెచ్ 370: అన్వేషిత ప్రాంతం రెండింతలు చేయనున్నారు
కౌలాలంపూర్: గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యల ప్రాంతాన్ని పెంచనున్నారు. గత ఏడాది మార్చి 8వ తేదీన ఐదుగురు భారతీయులు సహా 239 మంది ప్రయాణీకులతో కౌలాలంపూర్ నుండి బీజింగ్కు బయలుదేరిన ఎంహెచ్ 370 గల్లంతైంది.
ఈ విమానం కోసం ఎన్నో దేశాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు దాని ఆచూకీ లభించలేదు. దక్షిణ హిందూ మహా సముద్రంలో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర విమానం ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు.
దీంతో మరో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర అన్వేషణ చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ విమానం ఆచూకీ మే నెల లోపు దొరకకపోతే ఈ మేరకు ప్రయత్నాలు చేపట్టాలని యోచిస్తున్నారు. మలేషియాకు ఆస్ట్రేలియా, చైనాలు సహకరించేందుకు సంసిద్ధత తెలిపాయి.
ప్రస్తుతం నాలుగు నౌకలు ప్రస్తుతం అన్వేషిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అరవై శాతం మేర అన్వేషణ పూర్తయింది. మరో నలభై శాతం ఉంది. ఆ తర్వాత కూడా దొరకకపోతే, మే నెల తర్వాత అన్వేషణ ప్రాంతాన్ని మరో ఆరవై వేల కిలోమీటర్లకు పెంచనున్నారు.