రెండోస్సారి.. ఇవాళ ట్రంప్ - కిమ్ చరిత్రాత్మక భేటీ
హనోరు : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ బుధవారం నాడు భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ రెండోసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వియత్నాం రాజధాని హనోరులో ఈ అగ్రనేతలు సమావేశమవుతారు. 2018, జూన్ లో ఇరుదేశాల అధినేతలు సింగపూర్ లో తొలిసారి భేటీ అయ్యారు. అప్పుడు కిమ్ ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్.. ఆయన మేధావి అంటూ కితాబిచ్చారు. అణ్వస్త్ర పరీక్షలకు బ్రేక్ వేయడానికి కిమ్ అంగీకరించినట్లు చెప్పారు.
ఒకవేళ అణ్వస్త్రాలను వదిలేందుకు సిద్ధమైతే ఉత్తరకొరియాకు సహకరిస్తామన్నారు ట్రంప్. తొలి భేటీ ఫలప్రదంగా కనిపించినప్పటికీ.. ఆ దేశంపై అమెరికా ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో రెండో దఫా వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో మళ్లీ ఆ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని ఉత్తరకొరియా ప్రెసిడెంట్ ఆఫీస్ వెల్లడించింది. చరిత్రాత్మక భేటీకి సంబంధించి హనోరుకు చేరుకున్న కిమ్ కు ఘనస్వాగతం లభించింది. అటు ట్రంప్ కూడా మంగళవారం నాడే హనోరుకు చేరుకున్నారు.