ఇక అక్కడ కూడా ఫైజర్ వ్యాక్సిన్: సాధారణ ప్రజల వినియోగానికి: బ్రిటన్ తరువాత రెండో దేశం
ఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. మరో దేశం..కరోనా వ్యాక్సిన్ను సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి అవసరమైన అనుమతులను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన పాశ్చాత్య దేశాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఆసియాలో ఇప్పటికే రష్యా, చైనా ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక తాజాగా- కెనడా కూడా ఆ జాబితాలోకి చేరింది. ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇచ్చింది. భారత్లోనూ సాధారణ వినియోగానికి అనుమతులను కోరుతూ ఫైజర్ సంస్థ.. ప్రతిపాదనలను పంపించింది.
Recommended Video
ఫలిస్తోన్న ప్రయోగాలు..
కరోనాను నిర్మూలించడానికి ఇదివరకు చేపట్టిన ప్రయోగాల ఫలితాలు ఇక సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. అందుబాటులోకి వస్తున్నాయి. వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడంలో ఫైజర్ ముందంజలో ఉంటోంది. క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసుకున్న ఆ సంస్థ.. బ్రిటన్లో వ్యాక్సిన్ను సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 7వ తేదీన మార్గరెట్ కీనన్ అనే 90 సంవత్సరాల వయోధిక వృద్ధురాలికి తొలి ఇంజెక్షన్ ఇచ్చారు. 95 శాతం మేర ప్రభావం చూపుతుందంటూ తేలింది. దీనితో కెనడా ప్రభుత్వం కూడా ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చింది.
ఫైజర్-బయో ఎన్టెక్..
రష్యా, చైనా, బ్రిటన్ తరువాత కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చిన మూడో దేశం..కెనడా.అమెరికాకు చెందిన ఫార్మాసూటికల్స్ జెయింట్ ఫైజర్, బయో ఎన్టెక్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించిన తరువాత ఆ దేశ హెల్త్ రెగ్యులేటరీ దీనికి సంబంధించిన అనుమతులను జారీ చేసింది. ఈ విషయాన్ని ఫెడరల్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది.
రెండున్నర లక్షల తొలి డోసులు
రెండు లక్షలకు పైగా ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసులు కెనడాకు అందనున్నాయి. 2,49,000 డోసులను తొలిదశ కింద అందబోతున్నాయని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో తెలిపారు. 20 మిలియన్ల డోసుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారాయన. వాటిని పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా 14 డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను నెలకొల్పినట్లు చెప్పారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఆరు మిలియన్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఫైజర్, మోడెర్నా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ల ద్వారా ఇవి అందుతాయని పేర్కొన్నారు.
రెండు దశల్లో డోసులు..
తొలిదశలో 30 లక్షల మంది ప్రజలకు రెండు దశల్లో వ్యాక్సిన్ ఇస్తామని వివరించారు. పూర్తిస్థాయిలో రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని హెల్త్ రెగ్యులేటరీ గుర్తించినట్లు జస్టిన్ ట్రూడో చెప్పారు. తొలి డోస్ ఇచ్చిన 21 రోజుల తరువాత మలి దశలో ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తొలి డోస్ తీసుకున్న 28 రోజుల్లో పూర్తిస్థాయిలో ఇమ్మూనిటీ పెరుగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. త్వరలోనే తమ దేశం కరోనా రహితంగా మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
రష్యా, చైనా, బ్రిటన్ తరువాత..
ఇదివరకు రష్యా తొలిసారిగా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో వ్యాక్సిన్ను అమల్లోకి తీసుకొచ్చిన రెండో దేశంగా నిలిచింది కెనడా. ఆసియా దేశాలతో కలుపుకొంటే కెనడాది నాలుగో స్థానం. రష్యా దేశీయంగా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రస్తుతం అక్కడ వినియోగంలో ఉంది. తొలిదశలో వయోధిక వృద్ధులకు దీన్ని అందిస్తున్నారు. అనంతరం- చైనా ఆ జాబితాలో చేరింది. ఆ దేశం కూడా సొంతంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది.