టెర్రరిస్తులనుకొని టూరిస్టులను కాల్చి చంపేశారు
కైరో: ఈజిప్టు భద్రతా బలగాలు ఘోరా తప్పిదానికి పాల్పడి పాపం మూట కట్టుకున్నారు. విహారయాత్రకు వచ్చిన విదేశీ టూరిస్టులను పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 10 మంది టూరిస్టులు బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
12 మంది పర్యాటకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఈ ఘటన సంచలనానికి తెరతీసింది. ఈజిప్టులో అక్కడి భద్రతా బలగాలు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను అంతం చేస్తున్నాయి. గత ఆరు రోజుల నుంచి వరుసగా ఉగ్రవాదలు మీద దాడులు చేస్తున్నారు.
ఈజిప్టులోని అల వాహత్ అనే భాగం నిషేధిత ప్రాంతం. నాలుగు వాహనాల్లో మెక్సికన్ టూరిస్టులు ఆదివారం సాయంత్రం అనుకోకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లారు. అప్పటి వరకు ఉగ్రవాదుల మీద దాడులు చేసిన ఈజిప్టు సైన్యం టూరిస్టులు వెలుతున్న వాహనాలు గుర్తించారు.
ఆ వాహనాలలో ఉన్న వారు ఉగ్రవాదులు అనుకుని ఒక్క సారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. సైన్యం జరిపిన కాల్పులలో 12 మంది టూరిస్టులు సంఘటనా స్థలంలో మరణించారు. మరో పది మంది మెక్సికో, ఈజిప్టు టూరిస్టులకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు.
ఈజిప్టుకు ప్రధానంగా టూరిజం నుంచి ఆదాయం వస్తున్నది. ఈ ఘటనతో టూరిజంపై కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే మెక్సికో మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు ఏ విధంగా స్పందించలేదు.