యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో అత్యాచారానికి గురయ్యా: యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్
న్యూయార్క్: అమెరికా రక్షణ విభాగంలో పనిచేసే మహిళలకు కనీస భద్రత లేకుండా పోతోందనడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. సైన్యంలో పనిచేసే మహిళలపై లైంగిక దోపిడీ, అత్యాచారాలు, లైంగిక దాడులు ఏటేటా గణనీయంగా పెరుగుతున్నాయి. ఒక్క 2017లోనే లైంగిక దాడి ఘటనలు 10 శాతం మేరకు నమోదయ్యాయి.
తాజాగా తాను కూడా అత్యాచారానికి, లైంగిక దాడికి గురయ్యానని సెనెటర్ మార్థా మెక్ శాల్లీ వెల్లడించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అరిజోనా నుంచి ఆమె ఎన్నికయ్యారు. గతంలో ఆ దేశ వైమానిక దళంలో పనిచేశారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గా గుర్తింపు పొందారు.
బుధవారం ఆమె సెనెట్ ఆర్మ్డ్ సర్వీసెస్ సబ్ కమిటీ విచారణకు హాజరయ్యారు. సైన్యంలో మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకుంటున్నాయనడానికి తన ఉదంతమే సాక్ష్యమని అన్నారు. అమెరికా వైమానిక దళంలో చేరిన తొలి రోజుల్లో తాను అత్యాచారానికి గురయ్యానని చెప్పారు.
5ఏళ్ల నుంచి ఏడాదికి, మూడు నెలలకు తగ్గింపు: పాకిస్తాన్కు అమెరికా వీసా షాక్, కారణమిదే!
తన పైఅధికారులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు. అనేక కారణాల వల్ల తాను ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేదని అన్నారు. లైంగిక దాడి కొనసాగుతున్నప్పటికీ..కొన్నేళ్ల పాటు తాను మౌనంగా భరించినట్లు సబ్ కమిటీ ముందు వివరించారు.
క్రమంగా మిలటరీలో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, సైన్యాధికారులు బాధ్యతారాహిత్యం తీవ్రమైందని ఆరోపించారు. తాను పడిన మానసిక వేదనను బహిర్గతం చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. మిలటరీ దారుణాల గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తాను నోరు తెరిచానని మార్థా తెలిపారు. తనలాగే చాలామంది మహిళా బాధితులు ఉన్నారని అన్నారు. సీనియారిటీ ఉన్నప్పటికీ.. కీలక బాధ్యతలను అప్పగించకుండా దూరం పెట్టారని విమర్శించారు.
26 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో..
మార్థా మెక్ శాల్లీ 26 సంవత్సరాలు అమెరికా ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి పైలెట్ గా గుర్తింపు పొందారు. ప్రతిష్ఠాత్మక కల్నల్ హోదాను అందుకున్నారు. 2010లో ఆమె పదవీ విరమణ చేశారు. అనంతరం రిపబ్లికన్ పార్టీలో చేరారు. వరుసగా రెండుసార్లు హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్ కు ఎన్నికయ్యారు. గత ఏడాది అరిజోనా నుంచి సెనెటర్ గా గెలుపొందారు.