మళ్లీ లాక్డౌన్ విధింపు: విసుగెత్తిన జనం: పార్లమెంట్పై దాడి..విధ్వంసం: అట్టుడుకుతోన్న రాజధాని
బెల్గ్రేడ్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించానికి ఉద్దేశించిన లాక్డౌన్ పట్ల ప్రజలు ఎంతగా విసుగెత్తిపోయారో చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన. కరోనా బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం లాక్డౌన్. ఇప్పటికే రోజుల తరబడి కొనసాగిన లాక్డౌన్ను మరోసారి విధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాజధానిలో అల్లకల్లోలాన్ని సృష్టించారు. ఏకంగా పార్లమెంట్ భవనం మీద దాడికి దిగారు. సెర్బియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సెర్బియాలో రాజధానిలో మిన్నంటిన నిరసనలు..
ప్రపంచంలోని అన్ని దేశాల తరహాలోనే సెర్బియా కూడా కరోనా వైరస్ బారిన పడింది. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే.. సెర్బియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గానీ, మరణాలు గానీ చాలా తక్కువ. రికవరీ రేటు కూడా అద్భుతంగా ఉంటోందక్కడ. ప్రస్తుతం సెర్బియాలో మొత్తం 16,719 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 330. రికవరీ రేటు మాత్రం అద్దిరిపోయింది. 13,366 మంది కరోనా పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రులు, ఐసొలేషన్ కేంద్రాల నుంచి డిశ్చార్జి అయ్యారు.
కొత్తగా కేసులు నమోదు కావడంతో..
కొద్దిరోజులుగా సెర్బియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. వారంరోజుల వ్యవధిలో ఆ దేశంలో కొత్తగా 300 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13 మంది మరణించారు. ఈ పెరుగుదలను సెర్బియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీన్ని నియంత్రించడానికి లాక్డౌన్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కఠిన నిబంధనలను రూపొందించింది. శుక్రవారం నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తుందని సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వ్యుసిక్ ప్రకటించారు. సెర్బియా కాలమానం ప్రకారం.. మంగళవారం ఆయన ఈ ప్రకటన చేశారు.
భగ్గుమన్న జనం..
కొత్తగా మరోసారి లాక్డౌన్ను విధిస్తామంటూ అధ్యక్షుడు చేసిన ప్రకటనను టీవీ ఛానళ్లు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వెంటనే సెర్బియన్లు భగ్గుమన్నారు. ఒక్కసారిగా రోడ్డెక్కారు. వేలాదిమంది రోడ్లమీద గుమికూడారు. ప్రదర్శనగా తరలివెళ్లారు. హైసెక్యూరిటీ జోన్లో పార్లమెంట్ భవనం ముందు నిరసన ప్రదర్శనలకు దిగారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నారు. లాఠీఛార్జీ చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. రాళ్లు రువ్వారు.
ప్లకార్డులకు నిప్పులు..
ఆందోళనకారులు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులకు నిప్పు పెట్టారు. పార్లమెంట్ భవనం ముందు తమకు దొరికిన వస్తువులను విసిరేశారు. ప్రభుత్వానికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వేలాదిమంది ఒక్కసారిగా గుంపుగా రావడంతో వారిని నియంత్రించడంలో భద్రతా బలగాలు చేతులెత్తేశాయి. ఆందోళనకారుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించాయి. లాక్డౌన్ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. కరోనా వైరస్ కేసులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.