మళ్లీ బాంబుల మోత... దద్దరిల్లిన కాబూల్... ఆఫ్ఘన్లో ఆగని నెత్తుటేరులు...
ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబూల్ నగరంలో శనివారం(నవంబర్ 21) వరుస పేలుళ్లు సంభవించాయి. నగరానికి ఆనుకుని జనసాంద్రత ఎక్కువగా ఉండే గ్రీన్ జోన్ పరిధిలోనూ పేలుళ్లు జరిగాయి. నగరంపై రాకెట్ల దాడి జరిగిన తరహాలో భారీ శబ్దాలతో పేలుళ్లు చోటు చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. పేలుళ్ల ప్రాణనష్టంపై ఇప్పటికైతే ఎలాంటి రిపోర్ట్స్ రాలేదు. తాలిబన్లతో శాంతి చర్చల నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఖతార్ పర్యటనకు వెళ్లే ముందు ఈ పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం.
బాంబు దాడుల్లో పోలీస్ మృతి
పేలుళ్లపై ఆఫ్ఘన్ మంత్రి ఒకరు మాట్లాడుతూ... శనివారం ఉదయం రెండు బాంబు దాడులు జరిగినట్లు తెలిపారు. ఒక బాంబు దాడిలో పోలీస్ వాహనం ధ్వంసమై ఒక పోలీస్ అధికారి మృతి చెందినట్లు తెలిపారు. మరో ముగ్గురు గాయపడినట్లు చెప్పారు. పేలుళ్లపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆఫ్ఘనిస్తాన్లో పేలుళ్ల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లపై స్పందించలేదు.
పురోగతి లేని శాంతి చర్చలు
ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికా ప్రోత్సాహంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి,తాలిబన్లకు మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఇరువురి మధ్య జరిగిన తొలి ముఖాముఖి చర్చలు ఇవే కావడం గమనార్హం. ఈ చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది.తాలిబన్లు మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ చట్టాలను అమలు చేయాల్సిందేనని ప్రతిపాదించారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. చర్చలైతే జరిగాయి కానీ ఇరువురి ప్రతిపాదనలపై ఎటువంటి పురోగతి లేదు. దీంతో చర్చలు సఫలం కావాలన్న అమెరికా ఆకాంక్ష నెరవేరలేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో త్వరలో ఖతార్లో తాలిబన్లతో సమావేశం కాబోతున్నారు. ఇంతలోనే ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం.
Recommended Video
ఆర్నెళ్లలో 1250 పేలుళ్లు...
గత ఆర్నెళ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో 53 ఆత్మాహుతి దాడులు,1250 పేలుళ్లు సంభవించాయి. ఇందులో 1210 మంది అమాయక పౌరులు మృతి చెందారు. 2500 మంది గాయపడ్డారు. శాంతి చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ... తాలిబన్లే ఈ దాడులు చేస్తున్నారని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యాన్ని ఉపసంహరిస్తే... పట్టణ ప్రాంతాల్లో దాడులు జరపమని శాంతిచర్చల్లో తాలిబన్లు మాటిచ్చారు. అయితే ఇప్పుడు ఆ మాటకు కట్టబడకుండా మళ్లీ విధ్వంసం మొదలుపెట్టారని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో శాంతి చర్చలు ఓ కొలిక్కి రాకముందే... ఆఫ్ఘన్లో మళ్లీ నెత్తుటేరులు పారుతున్నాయి.