ఐసియూలో ఒక్కటైన జంట: అక్కడే కూతురి పెళ్లి(వీడియో)
చికాగో: శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నాడు. కాగా, అతని ఆరోగ్యం నయం అయ్యే అవకాశాలు లేవని వైద్యులు తేల్చేశారు. దీంతో అతని గుండె వేగం మరింత పెరిగింది. అతడు చేయాల్సిన రెండు ముఖ్య పనులు గుర్తుకొచ్చాయి. వెంటనే ఆ పనులను పూర్తి చేయించాడు.
అందులో ఒకటి తన కూతురు పెళ్లి కాగా, రెండోది అతను సహజీవనం చేస్తున్న మహిళను పెళ్లి చేసుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు ఆనందభాష్పాల మధ్య కాకుండా అందరి హృదయాలను కదిలించే విధంగా జరిగాయి. అయితే ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వ్యక్తికి మాత్రం శాశ్వత ఆనందాన్ని మిగిల్చాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జుబల్ కిర్బీ (49) తీవ్రమైన శ్వాసకోశ (పల్మనరీ ఫైబ్రోసిస్) వ్యాధితో బాధపడుతున్నాడు. రోజురోజుకి మృత్యువుకు దగ్గరవుతున్నాడు. ఈ సమయంలో గత సోమవారం కొల్లీన్ కిర్బీని చట్టబద్ధంగా తన భార్యను చేసుకున్నాడు.
26 సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంతేగాక, కూతుళ్లు కూడా లేకుండానే ఇంటెన్సివ్ కేర్ యూనిట్నే వేదికగా ఎంచుకున్నారు. కూతురు కైలా (20) కు వచ్చే సంవత్సరం జూలై 16న పెళ్లి చేయాలని ముహూర్తం నిర్ణయించారు.
కానీ, జుబల్ పరిస్థితి క్షీణిస్తూ వుండడంతో కైలా తన నిర్ణయం మార్చుకుంది. అత్యవసరంగా పెళ్లి చేసుకోవాలనుకుంది. తండ్రి సమక్షంలోనే జుబల్ చికిత్స పొందుతున్న ఇంటెన్సివ్ కేర్ రూమ్లోనే తమ పెళ్లి జరగాలని కోరుకుంది. హాస్పిటల్లోని డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులే అతిధులు కాగా, జుబల్ ఆనందబాష్పాల్ని చూస్తూ కైలా కిర్బీ, డానియల్ పార్దూ ఒక్కటయ్యారు.
పెళ్లి వేడుకను చూస్తున్న జుబల్ ఆక్సిజన్ మాస్క్ తీసేసి కన్నకూతురును ఆప్యాయంగా ముద్దాడాడు. దాదాపు 50 మంది హాజరైన ఆ వేడుకకు ఆస్పత్రి సిబ్బంది కేక్లు, పూలతో సహా అన్ని ఏర్పాటు చేశారు. కాగా, ‘నాకు సంతోషంగా ఉంది. కానీ, నాన్న నా పక్కన నిలబడాలనుకున్నా.. ఎందుకంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్' అంటూ కన్నీటిపర్యాంతమైంది నవవధువు కైలా.